Begin typing your search above and press return to search.

సగటు జీవికి ఒకే రోజు ఇన్ని షాకులా..?

By:  Tupaki Desk   |   7 Nov 2015 7:09 AM GMT
సగటు జీవికి ఒకే రోజు ఇన్ని షాకులా..?
X
సగటు జీవికి సర్కారుకు షాకుల మీద షాకులిచ్చింది. ఒకేరోజు ఇన్ని షాకులా అని అనుకునే పరిస్థితి. తాజాగా కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న పలు నిర్ణయాలు సగటు జీవిని ఇబ్బంది పెట్టేవే. చిత్రమైన విషయం ఏమిటంటే.. ఒకే రోజు ఇలాంటివి పలు నిర్ణయాలు తీసుకోవటం గమనార్హం.

1.ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టకుండా పన్నుల మీద పన్నులు వేయటం ప్రభుత్వాలకు అలవాటే. దానికి అ ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం అన్న వ్యత్యాసమేమీ లేదు. మోడీ సర్కారు కూడా మినహాయింపేమీ లేదు. తాజాగా స్వచ్ఛ సుంకం అంటూ 0.5శాతం పన్నును విధించింది. నవంబరు 15 నుంచి ఈ పన్నును వసూలు చేస్తారు. పన్ను వేయదగిన సేవలపై ఈ 0.5శాతం పన్ను వేస్తారు. ఇప్పటివరకూ విధించే 14 శాతం సేవాపన్నుకు ఈ 0.5శాతం అదనం. దీని ద్వారా ఏడాదికి రూ.4వేల కోట్లు అదనంగా సమకూరే వీలుంది.

2.ఇప్పటివరకూ గ్యాస్ వినియోగదారులకు పంపిణీ చేస్తున్న రాయితీ గ్యాస్ సిలిండర్ల మీద ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంటగ్యాస్ వినియోదారులలో సంపన్న వర్గాలకు సంబంధించి ఒక పరిమితి పెట్టుకొని.. అలాంటి వారిని రాయితీ నుంచి మినహాయించాలని కేంద్రం భావిస్తోంది. అంటే.. ప్రభుత్వం నిబంధనలకు లోబడి కొన్ని వర్గాలకు మాత్రమే రాయితీ మీద గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తారు. కిరోసిన్ విషయంలోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. అయితే.. దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒక్క కిరోసిన్ పంపిణీపై హేతుబద్ధీకరణ చేస్తే రూ.4 నుంచి రూ.5వేల కోట్లు ఆదా అవుతుందని కేంద్రం అంచనా వేస్తుంది.

3.రైల్వే రిజర్వేషన్ల విషయంలో టిక్కెట్టు క్యాన్సిల్ విధానంపై సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం.. ఇప్పటివరకూ ఉన్న క్యాన్సిలేషన్ ఛార్జీలను డబుల్ చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. కొత్త విధానం ఈ నెల 12 నుంచి అమల్లోకి రానుంది.

4.తెలంగాణలోని వాహనదారులు సెకండ్ హ్యాండ్ మీద కొనుగోలు చేసిన వారు.. యాజమాన్య హక్కుల్ని జనవరి 1 లోపు బదిలీ చేసుకోకుంటే.. సదరు వాహనాల్ని జఫ్తు చేయనున్నారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఇలాంటి వాహనాలు సుమారు 6 లక్షల వరకూ ఉంటాయని చెబుతున్నారు. సుమారు యాభై రోజుల వ్యవధిలో ఇన్ని లక్షల మంది బదిలీ చేసుకోవటం కొత్త ఇబ్బందులకు గురి చేయనుంది.

5.తెలంగాణ రాష్ట్రంలో నగర పంచాయితీలకు సంబంధించిన ఆస్తిపన్నును భారీగా పెంచేశారు. దీనికి సంబంధించి వస్తున్న నోటీసులు సగటు జీవులకు షాకులిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం ఇప్పటివరకూ ఏడాదికి రూ.4785 ఆస్తిపన్ను కట్టిన వ్యక్తికి తాజాగా రూ.22210 పన్ను కట్టాల్సిందిగా రావటంతో బేజారెత్తిపోతున్నారు. దీనిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నగర పంచాయితీల్లో ఉండే సౌకర్యాలకు.. వేసే పన్నుకు అస్సలు సంబంధమే ఉండటం లేదంటున్నారు.