Begin typing your search above and press return to search.

మోడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతారా?​

By:  Tupaki Desk   |   19 Feb 2016 6:37 AM GMT
మోడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతారా?​
X
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఊరట కల్పించనుందని సమాచారం. 60 యేళ్ల లోపు వ్యక్తిగత పన్నుచెల్లింపు దారులకు ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు ఉన్న పన్ను మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల వరకు పెంచనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. సీనియర్‌ సిటిజన్స్‌ (60 యేళ్లు పైబడిన వృద్ధులు), సూపర్‌ సీనియర్స్‌ (80 యేళ్లు పైబడిన వారు) ఆదాయపన్ను మినహాయింపులోనూ గణనీయంగా మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు ప్రస్తుతం రూ. 3 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉండగా, సూపర్‌ సీనియర్స్‌ కి రూ.5 లక్షల వరకు ఉంది.

ప్రస్తుతం రూ. 2.5 లక్షలకు మించి రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి 10 శాతం, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి 20 శాతం, రూ. పది లక్షల పైబడి ఆదాయం ఉన్న వారికి 30 శాతం పన్ను వసూలు అమలులో ఉంది. మౌళిక సదుపాయాల బాండ్లలో పెట్టుబడుల కోసం ఐటీ చట్టంలోని సెక్షన్‌ 80సి కింద రూ. 50 వేల వరకు మినహాయింపుకోసం జైట్లీ మరో ప్రతిపాదన ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.1.5 లక్షల వరకు ప్రత్యేకించిన వివిధ పెట్టుబడుల కోసం మినహాయింపులు ఉన్నాయి. దీనికి అదనంగా సెక్షన్‌ 80సీసీడీ కింది జాతీయ పించను సిస్టమ్‌ కోసం రూ. 50 వేల వరకు మినహాయింపు ఉంది. ఆదాయపన్ను చట్రంలోకి మరికొందరిని తీసుకువచ్చేందుకు కేంద్రం దూకుడు కనబరుస్తున్నప్పటికీ... మరోవైపు పన్నుచెల్లింపుదారుల్లోని అట్టడుగువర్గాలపై సాధ్యమైనంత వరకు భారం తగ్గించే యోచనలో కూడా ఉంది.

ప్రపంచంలోనే రెండో అత్యధిక జనాభా ఉన్న భారత దేశంలో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు కేవలం 3.5 నుంచి 4 కోట్ల మంది వరకు ఉన్నారు. పొదుపు రేటు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల చేతుల్లో కొంత మొత్తం మిగిలేలా పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం ఆవశ్యమనీ.. ఆర్ధికాభివృద్ధి, వినియోగం పెంపునకు ఈ చర్యలు సహాయపడ తాయని విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ. 4 లక్షలకు పెంచాలని పరిశ్రమల సమాఖ్య అసోచామ్‌ ఇటీవల ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. అంతకుముందు రూ. లక్ష వరకు ఉన్న పరిమితిని 2014-15లో రూ.1.5 వరకు కేంద్రప్రభుత్వం పెంచింది. పోస్టల్‌ డిపాజిట్లు - పీఎఫ్‌ - పెన్సన్‌ స్కీమ్‌ లు - మ్యుచువల్‌ ఫండ్స్‌ - బీమా తదితర పథకాల్లో మదుపులన్నిటినీ కలిపి ఈ పరిమితిని నిర్దేశించింది.