Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ లో విలీనానికి బాబు ఎప్పుడో రెడీ

By:  Tupaki Desk   |   3 Jun 2018 5:02 PM GMT
కాంగ్రెస్‌ లో విలీనానికి బాబు ఎప్పుడో రెడీ
X
న‌వ‌నిర్మాణ దీక్ష‌ల పేరుతో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని వైసీపీ మండిప‌డింది. ఉద్దేశ‌పూర్వ‌కంగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తీవ్రంగా దెబ్బ‌తీసిన చంద్ర‌బాబు ఇప్పుడు మొస‌లిక‌న్నీరు కారుస్తూ..దీక్ష‌లు చేస్తున్నార‌ని ఆరోపించింది. వైసీపీ సీనియ‌ర్ నేత త‌మ్మినేని సీతారం ఈమేర‌కు బాబు తీరుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు వృద్ధాప్యం వల్లనో ఏమో - పూర్తిగా మైండ్ ఆబ్సెంట్ తో పాలనను నిర్వహిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఎటువంటి నిర్మాణాత్మక కార్యక్రమాలను చేపట్టకుండా రైతులు - యువత - విద్యార్ధులు మొదలైన వారి బలవన్మరణాలకు కారణమవుతూ ఇప్పుడు చేస్తున్నవి శవ నిర్మాణాత్మక దీక్షలు కాక మరొకటి కావని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చింపాంజీని రెడిమేడ్ దుస్తులతో అలకరించి మిస్ ఇండియా పోటీలకు పంపినట్లుగా రాష్ట్రంలోని చంద్రబాబు పాలన ఉందని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలను వంచించడానికే చంద్రబాబు నవ నిర్మాణ దీక్షలు చేస్తున్నారని తమ్మినేని సీతారాం అన్నారు.

విజయవాడ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తమ్మినేని సీతారాం మీడియా సమావేశంలో మాట్లాడారు. తమది తెలుగు కాంగ్రెస్ పార్టీనా, పిల్ల కాంగ్రెస్ పార్టీనా అన్న దానిపై చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వాలని,. చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కోవర్టుగా పనిచేస్తున్నారని,అవన్నీ ఇటీవలి కాలంలో బట్టబయలు అవుతున్నాయనీ, ఇక టీడీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడమే తరువాయిగా కనిపిస్తోందని ఆయన అన్నారు.ఎప్పుడూ రెండు వేళ్లతో విక్టరీ చూపించే చంద్రబాబు నాయుడు బెంగుళూరు వెళ్లి భస్మాసుర హస్తం చూపడమే ఆయన కాంగ్రెస్ తో కలిసి పోయారనడానికి ప్రత్యక్ష నిదర్శనమని తమ్మినేని సీతారాం అన్నారు. టీడీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ఎప్పుడో నిర్ణయించేసుకున్నార‌నీ అయితే అది బ‌హిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లో కలిసిపోతున్నామనే స్పష్టమైన సంకేతాలను ప్రజలకు ఇస్తూనే ఉన్నారని అన్నారు. అంతే కాకుండా ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో తనకు తెలుసునంటూ చంద్రబాబు వ్యాఖ్యల వెనక మర్మం కూడా ఇదేనని ఆయన పేర్కొన్నారు.

యువతరానికి దశా నిర్దేశం చేసేలా యువ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టకుండా, ఇంక నవ నిర్మాణ దీక్షల్లో అర్థమేముందంటూ త‌మ్మినేని నిలదీశారు.కోటీ 70 లక్షల మందికి నిరుద్యోగులకు భృతి ఇస్తామంటూ ఎన్నికలకు ముందు ప్రకటించి, తీరా ఇప్పుడే అనేక మార్పులతో 10 లక్షల మందికే ఇస్తామనీ, అది కూడా ప్రకటించిన 2 వేల కాకుండా, వెయ్యి మాత్రమే అని చెప్పడంతో పాటు అది కూడా ఎప్పటి నుంచి ఇస్తారో కూడా స్పష్టత ఇవ్వని చంద్రబాబుకు నిర్మాణ దీక్షలు చేసే అర్హత ఉందా అని నిలదీశారు. అంతే కాకుండా విద్యార్దులకు సరైన సమయంలో ఉపకార వేతనాలు, పీజు రీయింబర్స్ మెంటులు అందక పోవడంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పిల్లలు పిట్టల్లా రాలుతుంటే నవనిర్మాణ దీక్షలు చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు.బాబు వస్తే జాబు అంటూ యువతల్లో ఆశలు రేకెత్తించి, వాటిని నిలబెట్టుకోవడంలో విఫలమవ్వడంతో యువత పెడదారి పట్టక తప్పని పరిస్థితి తీసుకుని వచ్చారనీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రుణమాఫీ జరగక,బ్యాంకుల నుంచి రుణాలు రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారనీ, డ్వాక్రా మహిళల పరిస్థితి అగ్యమ గోచరంగా ఉందనీ వీటిని ప‌రిష్క‌రించ‌డంపై దృష్టిపెట్ట‌కుండా న‌వ‌నిర్మాణ దీక్ష‌లంటూ కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌డం ఏంట‌ని త‌మ్మినేని ప్ర‌శ్నించారు.