Begin typing your search above and press return to search.

చినబాబు మీద బాబు ప్రమాణం చేయాలంట

By:  Tupaki Desk   |   7 Sep 2015 12:11 PM GMT
చినబాబు మీద బాబు ప్రమాణం చేయాలంట
X
రాజకీయాలన్నాక విషయాలు చాలానే ఉంటాయి. అంతమాత్రానికే ప్రమాణాలు.. గట్రా లాంటివి చేయాలంటూ మాట్లాడటం చూస్తే కాస్తంత కామెడీగా కనిపించక మానదు. ఓటుకు నోటు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మరింత ఫిక్స్ చేయాలన్న లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఉత్సాహంగా ప్రశ్నిస్తున్నారు. తాను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నానని.. బయటకు వచ్చిన ఆడియో టేపులో ఉన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు గొంతు అవునా? కాదా? అంటూ సూటిప్రశ్న వేసిన జగన్ కు ఎలాంటి సమాధానం లభించిందో తెలిసిందే.

అయితే.. ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించటం ద్వారా బాబు అండ్ కోను ఇబ్బంది పెట్టాలన్నదే వైఎస్సార్ కాంగ్రెస్ నేతల వ్యూహాంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ నేత.. తమ్మినేని సీతారాం చిత్రమైన అంశాల్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతు అని తాను తన కొడుకు మీద ప్రమాణం చేస్తానని.. అనంతరం తిరుపతి వెంకన్న.. కాణిపాకం వినాయకుడి ముందు ప్రమాణం చేస్తానని.. మరి.. ఆ గొంతు మీది కాదని నారా లోకేశ్ మీద ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు తన మకాంను ఏపీకి మార్చిన వెంటనే పిడుగులు పడి 20 మంది మరణించారంటూ బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేసేశారు. ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని అతని మీద విమర్శలు చేసేందుకు.. మరీ.. ఈ స్థాయిలో విమర్శలు చేయాల్సిన అవసరం లేదేమో. ఇన్ని మాటలు చెబుతున్న తమ్నినేనిని కొన్ని సూటి ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పగలరా అని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. జగన్ మధ్య ఎలాంటి రహస్య స్నేహం లేదని ప్రమాణం చేస్తారా?.. జగన్ తాను అవినీతి చేయలేదని తమ్మినేని తన కొడుకుల మీద ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. బాబు మకాం మార్చగానే 20 మంది మరణించినట్లు వ్యాఖ్యానిస్తున్న తమ్మినేని.. ఇప్పటికే ఇంటి గృహ ప్రవేశం గతంలోనే ఎప్పుడో జరిగిపోయిందన్న విషయం మర్చిపోకూడదని గుర్తు చేస్తున్నారు. విమర్శలు చేయటంలో తప్పు లేదు కానీ.. ఆ పేరు మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు.