Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వంపై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   5 Dec 2017 10:30 AM GMT
ఏపీ ప్రభుత్వంపై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X
టాపిక్ ఏదైనా సరే.. మొహమాటం లేకుండా.. ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న షార్ట్ ఫిలిం కాంటెస్టుకి అతిథిగా వెళ్లిన ఆయన.. అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు చూస్తే.. తెలుగు సినీ పరిశ్రమ తమకు అవసరం లేదేమో అన్నట్లుగా ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి చర్యలూ చేపట్టట్లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘‘మీ ప్రభుత్వం మా పరిశ్రమ విషయంలో ఏమంత ఆసక్తిగా కనిపించట్లేదు. ఇక్కడ సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వారికి మా అవసరం ఉందని చెబితే.. మాకు ఇక్కడ ఏం అవసరమో.. ఏం చేయాలో చెబుతాం. ప్రస్తుతానికి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ లో సంతోషంగా కొనసాగుతోంది. మాకు ఏపీ ప్రభుత్వం అవసరం లేదు.. ఏపీ ప్రభుత్వానికి మా అవసరమూ లేదు’’ అని కుండబద్దలు కొట్టేశారు తమ్మారెడ్డి. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్లు ఏపీలోనూ సినీ పరిశ్రమను అభివృద్ధి చేస్తామని.. అక్కడ సకల సౌకర్యాలు కల్పిస్తామని గొప్పగా ప్రకటనలు చేశారు. కానీ ఆ తర్వాత అలాంటి చర్యలేమీ చేపట్టిన దాఖలాలు లేవు. సినిమా వాళ్లే తరచుగా అక్కడ ఆడియో వేడుకులు.. ఇతర సినిమా ఫంక్షన్లు పెడుతున్నారు కానీ.. ప్రభుత్వం వైపుగా పరిశ్రమకు అనుకూలంగా ఏ చర్యలూ ఉండట్లేదన్న అసంతృప్తి సినీ వర్గాల్లో ఉంది.