Begin typing your search above and press return to search.

సీబీఐ కస్టడీలో 103 కిలోల బంగారం అదృశ్యం .. హైకోర్టు కీలక ఆదేశాలు !

By:  Tupaki Desk   |   12 Dec 2020 7:43 AM GMT
సీబీఐ కస్టడీలో 103 కిలోల బంగారం అదృశ్యం .. హైకోర్టు కీలక ఆదేశాలు !
X
దేశంలోని అక్రమార్కుల వెన్నులో వనుకు పుట్టించే కేంద్ర దర్యాప్తు సంస్థ అతి పెద్ద సమస్యలో చిక్కుకుంది. 2012 నాటి కేసులో సీబీఐ వ‌ద్ద ఉన్న 103 కిలోల బంగారం మిస్సైన‌ట్లు హైకోర్టులో ఫిర్యాదు న‌మోదు అయ్యింది. ఆ కేసులో త‌మిళ‌నాడు పోలీసులు విచార‌ణ చేప‌ట్టాల‌ని తాజాగా మ‌ద్రాసు హైకోర్టు ఆదేశించింది. దీంతో సీబీఐ ప్ర‌తిష్టకు మ‌చ్చ ప‌డిన‌ట్లు అయ్యింది. స్థానిక పోలీసులు త‌మ‌ల్ని విచారిస్తే, త‌మ ప్ర‌తిష్ట దెబ్బ‌తింటుంద‌ని సీబీఐ వాదించినా మ‌ద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది.

పిటిషన్‌పై స్పందించిన ధర్మాసనం.. ‘ఇది సీబీఐకి అగ్నిపరీక్షే. వారు సీతాదేవీ అంత పవిత్రంగా ఉంటే, వారి చేతులకు ఎలాంటి అవినీతి మరకలు లేకపోతే కేసు నుంచి క్షేమంగా బయటపడతారు. లేదంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని హైకోర్టు తెలిపింది. సుర‌నా కార్పొరేష‌న్ లిమిటెడ్ నుంచి సీజ్ చేసిన 400 కేజీల బంగారం నుంచి 103 కిలోల బంగారం అదృశ్య‌మైంది. 43 కోట్ల విలువైన ఆ బంగారం ఆచూకీ చెప్ప‌డంలో సీబీఐ విఫ‌ల‌మైంది. దీంతో స్థానిక పోలీసులు ఆ కేసును విచారించాల‌ని మ‌ద్రాసు హైకోర్టు శుక్ర‌వారం ఆదేశాలు జారీ చేసింది.

2012లో చెన్నైలోని సురాణా కార్పొరేషన్ లిమిటెడ్‌పై నమోదైన ఓ కేసులో సీబీఐ ఆ కంపెనీ నుంచి 400.47కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. బిస్కట్లు, ఆభరణాల రూపంలో ఉన్న ఈ పుత్తడిని కంపెనీ వాల్ట్‌ లో లాక్‌ చేసి సీల్‌ వేసింది. ఈ వాల్ట్‌ తాళాలను చెన్నైలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించింది. కాగా.. 2013లో సురాణా కంపెనీపై మరో కేసు నమోదు చేసిన సీబీఐ, తొలి కేసులో బంగారం స్వాధీనం అవసరం లేదని, దాన్ని రెండో కేసుకు బదలాయించాలని కోర్టును కోరింది. ఇందుకు న్యాయస్థానం అనుమతించింది. అయితే అప్పటికే బంగారం సీబీఐ కస్టడీలో ఉన్నందున భౌతికంగా దాన్ని ముట్టుకోకుండా.. కేసుల పత్రాల్లో మార్పు చేసింది. అయితే 2015లో సురాణా కంపెనీపై ఉన్న రెండో కేసును సరైన సాక్ష్యాలు లేని కారణంగా మూసివేస్తున్నట్లు ప్రత్యేక న్యాయస్థానానికి సీబీఐ నివేదిక సమర్పించింది.

దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్యాంకు ప్రతినిధుల సమక్షంలో సీబీఐ వాల్ట్‌ లను తెరిచింది. అందులోని బంగారాన్ని తూకం వేయగా.. 103 కేజీలు తక్కువగా ఉంది. దీంతో అంతా షాకయ్యారు. సురాణా కార్యాలయం నుంచి బంగారాన్ని తూకం వేసే స్వాధీనం చేసుకున్నామని.. అప్పుడు ఆ మొత్తం 400 కేజీలుగా చూపించినట్లు సీబీఐ హైకోర్టుకు తెలిపింది. పసిడి మొత్తాన్ని సీల్‌ చేశామని, అదృశ్యమైన బంగారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. అయితే స్వాధీనం సమయంలో బంగారు చైన్లు అన్నింటినీ కలిపి తూకం వేశారని, ఫిబ్రవరిలో విడివిడిగా తూకం వేశారని.. అందుకే బంగారం తగ్గిందని స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. అయితే ఈ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. 103 కిలోలకు పైగా ఎలా తగ్గుతుందని ప్రశ్నించింది. దీనిపై వెంటనే కేసు నమోదు చేసి ఎస్పీ ర్యాంక్‌ అధికారి ఆధ్వర్యంలో ఆరు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని తమిళనాడు పోలీసులను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.