Begin typing your search above and press return to search.

లోక్ సభ ఫలితాలతో.. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కుప్పకూలుతాయా?

By:  Tupaki Desk   |   1 May 2019 2:30 PM GMT
లోక్ సభ ఫలితాలతో.. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కుప్పకూలుతాయా?
X
సాధారణంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశిస్తాయి. కేంద్రంలో ఎవరైనా అధికారంలో ఉండటమా, కేంద్రంలో ప్రభుత్వం కూలిపోవడమా.. అనే అంశాలను లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయి. అయితే ఈ సారి లోక్ సభ ఎన్నికల ఫలితాలు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాల మనుగడను కూడా నిర్దేశించేలా ఉన్నాయి. అక్కడ అసలే రాజకీయ ప్రతిష్టంభనలు నెలకొంటున్న నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు వస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కుప్ప కూలే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.

అలా లోక్ సభ ఎన్నికల ఫలితాల మీద మనుగడ ఆధారపడ్డాయి తమిళనాడు - కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు. వీటి తదుపరి మనుగడను లోక్ సభ ఎన్నికల ఫలితాలే నిర్దేశించబోతున్నాయి.

అదెలాగంటే.. తమిళనాట ప్రభుత్వం చాలా డొల్లగా సాగుతూ ఉంది. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే కు ప్రజాకర్షక నేత లేకుండా పోయారు. జయ తర్వాత సీఎం అయిన పన్నీరు సెల్వాన్ని శశికళ దించేసింది. తనకు అనుకూలుడని పళనిస్వామిని సీఎంను చేసింది. అనంతరం ఆమె జైలు పాలైంది. ఆ తర్వాత ఈపీఎస్-ఓపీఎస్ లు స్నేహితులుగా మారారు. మోడీ ఆదేశాల మేరకు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.

అయితే వీరికి ఎమ్మెల్యేల నుంచి సహకారం లేదు. దీంతో ఇరవై రెండు అసెంబ్లీ స్థానాలకు బై పోల్స్ వచ్చాయి. లోక్ సభ ఎన్నికలతో పాటే అవి కూడా సాగుతూ ఉన్నాయి. వాటి ఫలితాలు కూడా మే ఇరవై మూడున రాబోతూ ఉన్నాయి. ఆ సీట్లలో విజయం పట్ల డీఎంకే ధీమాగా ఉంది. ఒకవేళ ఆ పార్టీ వాటిల్లో మెజారిటీ సీట్లను డీఎంకే నెగ్గితే పళనిస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది. ఇప్పటికే డీఎంకే అవిశ్వాస తీర్మానం నోటీసును కూడా ఇచ్చింది. దీంతో మే ఇరవై మూడు తర్వాత తమిళనాట అన్నాడీఎంకే ప్రభుత్వం మనుగడ కష్ట సాధ్యంగా మారింది.

ఇక కర్ణాటకలో కూడా ప్రభుత్వం గురించి తెలిసిన సంగతే. అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసిన కాంగ్రెస్ –జేడీఎస్ లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే వారికి ఉన్న మెజారిటీ స్వల్పమే. మూడు అసెంబ్లీ స్థానాలకు ఇప్పుడు ఉప ఎన్నికలు సాగుతూ ఉన్నాయి. వాటిల్లో ఫలితాలు కూడా సంకీర్ణ సర్కారు భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి.

మరి కొందరు కూటమి అభ్యర్థులు బీజేపీతో టచ్లోకి వెళ్లారు. ఇండిపెండెంట్లు కూటమికి మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో కుమారస్వామి ప్రభుత్వం ఎప్పుడు కుప్పకూలుతుందో చెప్పలేని పరిస్థితి. మే ఇరవై మూడున దేశ వ్యాప్తంగా బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తే కర్ణాటకలో ఆటోమెటిక్ గా రాష్ట్ర ప్రభుత్వం పడిపోయే అవకాశాలున్నాయి!