Begin typing your search above and press return to search.

తెదేపా మాస్టర్ మూవ్:తమిళుల్తో కదిపారు!

By:  Tupaki Desk   |   16 Sep 2017 3:53 AM GMT
తెదేపా మాస్టర్ మూవ్:తమిళుల్తో కదిపారు!
X
తెలుగుదేశం పార్టీ వక్రమార్గాలను తొక్కడంలో - అక్రమార్కులకు జై కొట్టేలా అతి తెలివి ఎత్తుగడలు ప్రదర్శించడంలో మరో ముందడుగు వేసిందా? అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. 14వ తేదీ జరగాల్సిన సదావర్తి భూముల వేలాన్ని రకరకాల సాకులు చూపించి 18వ తేదికి వాయిదా వేశారు. సరిగ్గా ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఈ వేలానికి అడ్డు పడుతోంది. చూడబోతే.. సదావర్తి భూములను అడ్డగోలుగా - చౌకధరలకు కొట్టేసిన తెలుగుదేశం నాయకులే చాటుమాటుగా పావులు కదిపి తమిళనాడు ప్రభుత్వాన్ని కదిపి... ఇలాంటి పిటిషన్ వేయించిందేమో అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి.

తమిళనాడులోని చెంగల్పట్టు వద్ద సదావర్తి సత్రానికి భూములు ఉన్నాయి. ఇవి ఏపీ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న భూములు. తెలుగుదేశానికి చెందిన కొందరు నాయకులకు 83 ఎకరాల భూములను కేవలం 22.5 కోట్లకు అమ్మేశారు. దీనిపై వైకాపా ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లడంతో గొడవ జరిగింది. వ్యవహారం సుప్రీం దాకా వెళ్లి రెండోసారి వేలానికి ఆదేశించారు. షెడ్యూలు ప్రకారం అయితే ఈనెల 14న వేలం జరిగి ఉండాల్సింది. అయిదు బిడ్లు కూడా దాఖలయ్యాయి. అయితే సాంకేతిక కారణాల సాకు చూపి.. 18నాటికి ప్రభుత్వం వేలాన్ని వాయిదా వేసింది. 15 వ తేదీన తమిళనాడు ప్రభుత్వం సుప్రీంలో కేసు వేసింది.

ఈ భూములు తమకే చెందుతాయని, తమ ప్రభుత్వ భూములు అని.. ఈ భూములపై సదావర్తి సత్రానికే ఎలాంటి హక్కు లేదని తమిళ ప్రభుత్వం ఆ పిటిషన్ లో పేర్కొంటోంది. రకరకాల నిబంధనలు - తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్టాలను అన్నిటినీ పేర్కొంటూ.. మొత్తానికి సదావర్తి భూములను వేలం వేయడానికి వీల్లేదని, 18వ తేదీ జరగాల్సిన వేలాన్ని ఆపు చేయాలని ఆ ప్రభుత్వ అడుగుతోంది.

చూడబోతే ఇదంతా కూడా తెరవెనుక నుంచి ఎవరో ఆడిస్తున్న డ్రామా లాగా కనిపిస్తోందని జనం అనుకుంటున్నారు. ఏడాదిన్నరకు ముందే సదావర్తి భూముల విక్రయం జరిగిపోగా.. ఇన్నాళ్లూ ఈ ప్రభుత్వం ఏం చేసిందని... ఇప్పుడు ఇలా కోర్టు ఉత్తర్వులకు అడ్డం పడడంలో మర్మం ఏమిటని ప్రజలు వాదిస్తున్నారు. మొత్తానికి తెరవెనుక నుంచి పచ్చదళాలే పావులు కదుపుతున్నట్లుగా జనానికి సందేహాలు కలుగుతున్నాయి.