Begin typing your search above and press return to search.

మోడీ మీద కోపంతో సినిమా టికెట్ల ధ‌ర‌లు పెంచారు

By:  Tupaki Desk   |   8 Oct 2017 10:29 AM GMT
మోడీ మీద కోపంతో సినిమా టికెట్ల ధ‌ర‌లు పెంచారు
X
జీఎస్టీ పుణ్య‌మా అని సినిమా టికెట్ల మీద కేంద్ర ప్ర‌భుత్వం వేసిన భారాన్ని సామాన్యుడి ఖాతాకు మ‌ళ్లించేలా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకుంది. సినిమా టికెట్ల‌పై వేసిన ప‌న్ను భారం ఎక్కువ‌గా ఉంద‌ని.. దాన్ని త‌గ్గించాలంటూ చేస్తున్న డిమాండ్ల‌పై కేంద్రం స్పందించ‌ని నేప‌థ్యంలో ఆ భారాన్ని ప్రేక్ష‌కుల మీద మోపుతూ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం టికెట్ ధ‌ర‌ల్ని పెంచుతూ తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఈ నేప‌థ్యంలో ఏసీ.. మ‌ల్టీఫ్లెక్స్ ల‌లో టికెట్ల ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. ఇప్పుడున్న టికెట్ ధ‌ర‌ల‌కు అద‌నంగా రూ.10 నుంచి రూ.15 పెంచుతూ తీసుకున్న నిర్ణ‌యానికి జీఎస్టీ అద‌నంగా క‌ల‌వ‌నుంది. ఇది కాక‌.. ఆన్ లైన్లో బుక్ చేసుకునే టికెట్ల‌కు ఆ భారం మ‌రింత జ‌త కానుంది.

తాజా పెంపుతో మొత్తంగా టికెట్ ధర రూ.192 కానున్న‌ట్లు చెబుతున్నారు. ఏసీ థియేట‌ర్లో టికెట్ ధ‌ర రూ.160 వ‌సూలు చేస్తున్నారు. ఆన్ లైన్లో టికెట్లు కొనుగోలు చేస్తే అద‌న‌పు చార్జీలు క‌ల‌వ‌నున్నాయి. తాజాగా టికెట్ల ధ‌ర‌లు పెంచుతూ తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా నిర్మాత‌ల‌కు వ‌రంగా.. సామాన్య‌ప్రేక్ష‌కుల‌కు భారంగా మార‌నున్నాయి. పెంచిన టికెట్ ధ‌ర‌లు అక్టోబ‌రు 9 నుంచి అమ‌ల్లోకి రానున్న‌ట్లుగా చెబుతున్నారు. అటు తిరిగి.. ఇటు తిరిగి చివ‌ర‌కు దొరికింది సామాన్య ప్రేక్ష‌కుడు కావ‌టం గ‌మ‌నార్హం. ప‌న్నుబాదుడు విష‌యంలో కేంద్రం క‌నిక‌రం చూపించ‌క‌పోవ‌టం.. రాష్ట్ర స‌ర్కారు వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌టం ఒక ఎత్తు అయితే కొత్త‌గా ప్రేక్ష‌కుడి మీద భారాన్ని మోపాల‌న్న నిర్ణ‌యం చూసిన‌ప్పుడు.. పాల‌కుల కోపాల‌కు బ‌లి కావాల్సింది సామాన్యుడేన‌న్న విష‌యం మ‌రోసారి నిరూపిత‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.