Begin typing your search above and press return to search.

మాక్ డ్రిల్ విద్యార్థి ప్రాణాలు తీసింది.

By:  Tupaki Desk   |   13 July 2018 10:30 AM GMT
మాక్ డ్రిల్ విద్యార్థి ప్రాణాలు తీసింది.
X
మాక్ డ్రిల్ ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. ట్రైనర్ నిర్లక్ష్యం కారణంగా ఓ 19 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కోయంబత్తూర్ జిల్లా నర్సీపురం లోని కోవై కలైమగల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గురువారం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదాల సమయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. చైన్నైకి చెందిన ఫైర్ సేఫ్టీ బృందం.. సుమారు 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి 40 రోజులుగా శిక్షణ ఇస్తున్నారు.

గురువారం మధ్యాహ్నం ఒక్కొక్కరిని రెండో అంతస్తు నుంచి కిందకు దూకించగా.. కింద విద్యార్థులు వల సాయంతో వారిని రక్షిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే లోగేశ్వరి అనే బీబీఏ స్టూడెంట్ ను సహాయక సిబ్బంది కిందకు తోశారు. అయితే ఆ విద్యార్థిని అప్రమత్తంగా లేకపోవడంతో కింద ఫ్లోర్ సెల్ఫ్ కు తల బలంగా తాకి కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు.

లోగేశ్వరి స్వస్థలం అలందూరి. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకొని బోరున విలపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి లోగేశ్వరి మరణానికి కారణమయ్యాడంటూ ట్రైనర్ అర్ముగంను అదుపులోకి తీసుకొని పోలీసులు రిమాండ్ కు తరలించారు.