Begin typing your search above and press return to search.

దిగొస్తున్న తాలిబన్లు

By:  Tupaki Desk   |   18 Dec 2021 4:15 AM GMT
దిగొస్తున్న తాలిబన్లు
X
మెల్లి మెల్లిగా ఆఫ్ఘనిస్థాన్ ను కబ్జా చేసిన తాలిబన్లు దిగొస్తున్నారు. ప్రపంచ దేశాలు ఒకవైపు తాలిబన్లను బిగించేస్తుంటే మరోవైపు అమెరికా అనేక రూపాల్లో తాలిబన్ల ఫ్రీజ్ చేసేస్తోంది. దాంతో వేరే దారిలేక తాలిబన్లు మెల్లిగా తగ్గుతున్నారు. తమ దేశంపై అమెరికా విధించిన ఆంక్షలను సడలించాలంటు బతిమలాడుకుంటోంది తాలిబన్ ప్రభుత్వం.

అంతర్జాతీయ సమాజంతో మంచి సంబంధాలను కోరుకుంటున్నామని కాబట్టి తమ దేశంపై విధించిన బ్యాన్ ను సడలించాలంటు చుట్టుపక్కల దేశాలను తాలిబన్లు కోరుకుంటున్నారు.

ఆఫ్ఘన్లో అధికారాన్ని కబ్జా చేసిన కొత్తల్లో ప్రపంచదేశాలతో తమకు పనేముందన్నట్లుగా వ్యవహరించారు. ఏ దేశంతో కూడా ఏ విషయంలోనూ చర్చలు జరిపేదేలేదని భీష్మించుకుని కూర్చున్నారు. అసలే తాలిబన్లంటే మంటమీదున్న అమెరికా మిత్ర దేశాలతో పాటు ఇండియా లాంటి పొరుగు దేశాలు కూడా విపరీతమైన ఆంక్షలను విధించాయి.

ఏ దేశంతో అయినా చర్చించాలంటే అది బెదిరింపు ధోరణిలో మాత్రమే ఉండేవి. అలాంటిది ఇపుడు ప్రపంచ దేశాలను బతిమలాడుకునే స్థాయికి వచ్చేసింది.

దీనికి కారణం ఏమిటంటే ఆంక్షలు మాత్రమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆఫ్ఘన్ నుంచి ఎగుమతులు-దిగుమతులు విషయంలో బ్యాన్ కంటిన్యు అవుతోంది. దీనివల్ల దేశంలో ఆహార సమస్య బాగా పెరిగిపోతోంది.

చిన్నా, పెద్దా తేడాలేకుండా ఆకలి చావులు పెరిగిపోతున్నాయి. కరెన్సీ సమస్య బాగా పట్టి పీడిస్తోంది. ఇదే సమయంలో విదేశాల్లో ప్రత్యేకించి అమెరికాలో ఉన్న మిలియన్ల ఆఫ్ఘన్ కరెన్సీతో పాటు వందల టన్నుల బంగారం కూడా తాలిబన్ల చేతికి అందకుండా పోయింది.

ఇదే విషయమై విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాబీ మాట్లాడుతూ ఆడపిల్లలకు విద్య, ఉద్యోగ-ఉపాధి కల్పన ద్వారా మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడుందన్నారు. ఇవన్నీ జరగాలంటే తమకు ప్రపంచదేశాల సాయం చాలా అవసరమన్నారు. తమ దేశంపై ఆంక్షల విధించటం వల్ల తమ ప్రజలకు నష్టమే కానీ ఏ దేశానికీ ఉపయోగం ఉండదని చెప్పారు.

అధికారంలోకి వచ్చిన కొత్తల్లో తమ వల్ల కొన్ని తప్పులు జరిగినట్లు ముత్తాబీ అంగీకరించటం గమనార్హం. జరిగిపోయిన వాటి గురించి మాట్లాడే బదులు జరగాల్సిన వాటి గురించే ఆలోచించాలని ముత్తాబీ ప్రపంచ దేశాలను కోరుకున్నారు.

ఐసిస్ చేసిన దాడులు కూడా ప్రపంచ దేశాలు తాలిబన్లే చేశాయని నమ్మటం నిజంగా తమ దురదృష్టమన్నారు. శాంతి స్ధాపనకు, మానవహక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడుందని ముత్తాబీ చెప్పటమే విచిత్రంగా ఉంది.