Begin typing your search above and press return to search.

టీ తమ్ముళ్లు మరీ ఇంత లేటా..?

By:  Tupaki Desk   |   23 Sep 2016 5:30 PM GMT
టీ తమ్ముళ్లు మరీ ఇంత లేటా..?
X
కొన్ని అంశాల మీద వెనువెంటనే స్పందించాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైన విషయానికి ఎంత త్వరగా స్పందించాలో.. అనవసర విషయాలకు సంబంధించి అంత దూరంగా ఉండటం మంచిది. కానీ.. ఈ విషయాన్ని తెలంగాణ తెలుగుదేశం తమ్ముళ్లు మర్చిపోయినట్లున్నారు. అధికారపక్షాన్ని ఇబ్బంది పెట్టే లడ్డూ లాంటి అవకాశం తలుపు తట్టినా.. తమ మొద్దునిద్రతో పట్టనట్లుగా వ్యవహరిస్తూ తప్పు చేస్తున్నారని చెప్పాలి. కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సమయంలో తెరపైకి వచ్చిన అభ్యంతరాలు కొన్నే.

కానీ.. కొత్త జిల్లాల కసరత్తు విషయంలో జరుగుతున్న ప్రయత్నాలు చూసిన తర్వాత ఒక్కొక్కరుగా తమకున్న అభ్యంతరాల్ని తెర మీదకు తీసుకురావటం మొదలెట్టారు. ఇప్పుడు పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే.. కొత్త జిల్లాల్ని అసెంబ్లీలో చర్చించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారన్న సూటిప్రశ్నతో పాటు.. కొత్త జిల్లాల ఏర్పాటు చట్టబద్ధం కాదన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

తెలంగాణ రాజకీయ జేఏసీ మొదలుకొని రాజకీయ పార్టీలు సైతం కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైఖరిని తప్పు పడుతున్నాయి. అయితే.. ఈ విషయంలో మిగిలిన పార్టీలతో పోలిస్తే.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆలస్యంగా స్పందించిందన్న భావన వ్యక్తమవుతోంది. కొత్త జిల్లాలకు సంబంధించి కొన్ని డిమాండ్లపై ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేపట్టినా.. అసలు కొత్త జిల్లాల అంశాన్ని అసెంబ్లీలో చర్చ జరపకుండా.. ఏకగ్రీవ నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటుందన్న వాదనను తెరపైకి తీసుకురావటంలో తమ్ముళ్లు పూర్తిగా ఫెయిల్ అయినట్లుగా చెబుతున్నారు.

తాజాగా.. అసెంబ్లీ సమావేశాల్ని సెప్టెంబరులో నిర్వహించాలని శాసనసభా వ్యవహారాల కమిటీ చేసిన నిర్ణయానికి విలువ లేదా అని తాజాగా ప్రశ్నిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సెప్టెంబరు నెల పూర్తి కావటానికి మరో వారమే ఉన్న వేళ.. సమావేశాలు నిర్వహించాలన్న విషయం గుర్తుకు రావటం ఏమిటో..? టీ తమ్ముళ్ల వాదన ప్రకారం ఈ నెలలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని శాసనసభా వ్యవహారాల కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. మరి.. ఆ విషయాన్ని నెల ముందు నుంచే ప్రస్తావిస్తూ.. మిగిలిన రాజకీయ పక్షాల్ని కలుపుకుంటూ ఆందోళన చేయటం.. ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సింది పోయి.. అంతా అయిపోయాక మాట్లాడటం మొదలుపెడితే లాభమేందన్నది ఒక ప్రశ్న. టైమ్లీగా రియాక్ట్ అయ్యే విషయంలో టీ తమ్ముళ్లు తప్పటడుగు వేయటం దేనికి సంకేతం..?