Begin typing your search above and press return to search.

కేసీఆర్ చర్యలతో పరువు పోయే పరిస్థితి

By:  Tupaki Desk   |   14 Jun 2016 5:30 AM GMT
కేసీఆర్ చర్యలతో పరువు పోయే పరిస్థితి
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి కారు ఎక్కుతుండటంతో ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో గ్రాండ్ ఓల్డ్ పార్టీ ప‌రువు గంగ‌పాలు కానుంద‌ని రాజ‌కీయ‌విశ్లేష‌కులు భావిస్తున్నారు.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ పార్టీ తరుపున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరారు. నారాయణ్‌ ఖేడ్‌ ఎమ్మెల్యే పి కిష్టారెడ్డి - పాలేరు ఎమ్మెల్యే వెంకట్‌ రెడ్డి మరణించడంతో ఆయా స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరగగా ఈ రెండు నియోజక వర్గాల్లోనూ టీఆర్‌ ఎస్‌ గెలుపొందింది. దీంతో కాంగ్రెస్‌ బలం 12కు పడిపోయింది. మరో ఎమ్మెల్యే పార్టీ మారితే కాంగ్రెస్‌ కు ప్రధాన ప్రతిపక్ష హోదా పోయే ప్రమాదం ఉన్నట్టు గాంధీభవన్‌ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

ఇదిలాఉండ‌గా ఇప్పటివరకు వివిధ రాజకీయ పార్టీల నుంచి నేతలు తెరాసలో చేరినా, తొలిసారి వామపక్షాల నుంచి ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారు. శాసనసభలో సీపీఐ - సీపీఎం పార్టీలకు ఒక్కో సభ్యుడున్నారు. ఈ క్ర‌మంలో సీపీఐ నుంచి నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజక వర్గం నుంచి గెలిచిన రవీంద్రనాయక్ నియోజకవర్గం అభివృద్ధి కోసం టీఆర్‌ ఎస్‌ లో చేరుతున్నట్టు చెప్పారు. దీంతో సీపీఐ పార్టీకి సైతం ఎమ్మెల్యే లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇదిలాఉండ‌గా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, రెండేళ్లలో దేవరకొండ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూలేని స్థాయిలో అభివృద్ధి సాధించినట్టు రవీంద్ర నాయక్ తెలిపారు. దేవరకొండ అభివృద్ధికి ప్రభుత్వం మూడు వందల కోట్లు కేటాయించిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాల్సి ఉందని, అందుకే తాను తెరాసలో చేరుతున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్‌ ను తాను ఎప్పుడూ కలువలేదని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సీఎం చూపుతున్న ఆసక్తి నచ్చిందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమన్నారు.