Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు స్వామీ స్వరూపానంద సవాల్

By:  Tupaki Desk   |   18 Dec 2015 10:22 AM GMT
చంద్రబాబుకు స్వామీ స్వరూపానంద సవాల్
X
దమ్ముంటే తిరుమల కొండను - సింహాచలం కొండను తవ్వాలని చంద్రబాబు ప్రభుత్వానికి విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతి సవాల్ విసిరారు. ఆ కొండలను తవ్వితే భక్తులు ఊరుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల ప్రతిపాదిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన మంచంగిపుట్టు - పెద్ద బయలు ప్రాంతాల్లో పర్యటించి బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి తన మద్దతు ప్రకటించారు. అక్కడి గిరిజనులకు దుప్పట్లు - చీరలు పంచిపెట్టారు.

ఆదివాసీల అమాయకత్వాన్ని అడ్డంపెట్టుకుని ప్రభుత్వం వారి సంపదను దోచుకునే ప్రయత్నం చేస్తోందని... రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగిస్తామంటే చెల్లదని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మన్యంలోని కొండలపై శ్రీరాముడు - శ్రీకృష్ణుడు నడయాడారని... అలాంటి పవిత్రమైన కొండలను తవ్వితే ఊరుకునేది లేదన్నారు. ప్రతి ఆదివాసీ బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడాలని... విదేశీ మూకలను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

కాగా చాలాకాలంగా చంద్రబాబుపై మండిపడుతున్న స్వరూపానంద ఏమాత్రం అవకాశం దొరికినా ముఖ్యమంత్రిని ఉతికి ఆరేస్తున్నారు. గతంలోనూ పలు సందర్భాల్లో ఆయన చంద్రబాబును వ్యతిరేకించారు. కాగా ఇటీవల కాలంలో రాజకీయ వ్యవహారాల్లో ఇంత డైరెక్టుగా కామెంట్లు చేస్తున్న, జోక్యం చేసుకుంటున్న స్వామీజీ ఇంకొకరు లేరని... ఆయన వెనక ఉన్న రాజకీయ శక్తులే ఆయన్ను ఈ దిశగా ప్రేరేపిస్తున్నాయన్న వాదనా వినిపిస్తోంది.