Begin typing your search above and press return to search.

స్వచ్చ భారత్ మిషన్.. టాప్ 10 లో విశాఖపట్నం!

By:  Tupaki Desk   |   17 Sep 2020 10:50 AM GMT
స్వచ్చ భారత్ మిషన్.. టాప్ 10 లో విశాఖపట్నం!
X
విశాఖపట్నం స్వచ్చ భారత్ మిషన్ ఆధ్వర్యంలో దేశంలో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి అవార్డు 2020 పోటీలో నిలిచింది. స్వచ్ఛతతో మెరిసిపోతున్న విశాఖ నగరం తాజాగా ప్రధానమంత్రి అవార్డు కోసం ఎంపిక చేసిన పది జిల్లాల జాబితాలో చోటు దక్కించుకుంది. దక్షిణాది రాష్ట్రాల తరఫున ఎంపికైన ఏకైక జిల్లాగా నిలిచింది విశాఖ. విశాఖ జిల్లాలోని మూడు పట్టణ స్థానిక సంస్థలు కలిపి ఒక క్లస్టర్ గా పోటీలో పాల్గొన్నాయి. స్వచ్ఛ సర్వేక్షన్ లో ఈ సంవత్సరం 14 స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలిచిన విశాఖ స్వచ్ఛత లో టాప్ 10 మహానగరాల చెంత నిలిచింది.

స్వచ్ఛత ప్రమాణాలను పాటిస్తూ, తడి చెత్త, పొడి చెత్త లను విభజిస్తూ, చెత్త నుండి ఎరువు ను తయారు చేస్తూ చెత్తరహిత నగరంగా విశాఖ ఇప్పటికే గుర్తింపు పొందింది. ఇప్పుడు పీఎం అవార్డుకు ఎంపిక చేసిన టాప్ టెన్ మహానగరాలలో విశాఖ స్థానాన్ని పొందింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛ భారత్ మిషన్ ప్రజల భాగస్వామ్యం కేటగిరీలో ప్రధానమంత్రి అవార్డు కోసం విశాఖ మహానగరం పోటీ పడుతోంది. ఈ పోటీలో ప్రధానంగా పరిసరాల పరిశుభ్రత, స్థానిక సంస్థలు అందించే సేవలు, చెత్త విభజన, ప్రజలకు కల్పించే అవగాహన కార్యక్రమాలు, వ్యక్తిగత పరిశుభ్రత, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం మొదలైన అంశాలలో ప్రజల అవగాహన, భాగస్వామ్యం ఎలా ఉంది అన్న దానిపై పోటీ నిర్వహిస్తున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటుగా, నర్సీపట్నం ,యలమంచిలి మున్సిపాలిటీలు కలిపి జిల్లా యుఎల్ బి క్లస్టర్ గా ఏర్పడి ఈ అవార్డు కోసం పోటీలో నిలిచాయి. అక్కడి ప్రజల యాక్టివ్ పార్టిసిపేషన్ మీద అవార్డు వచ్చేది లేనిది తెలుస్తుంది.

రాష్ట్రంలో తొలిసారిగా విశాఖ నగరంలోని యూజర్ ఫ్రెండ్లీ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ లోనూ, చెత్త నుంచి విద్యుత్ తయారీలోనూ, భవన నిర్మాణ వ్యర్ధాల నిర్వహణ విషయంలోనూ విశాఖ ముందంజలో ఉంది. ప్రమోటింగ్ పీపుల్స్ మూమెంట్ జన భగీరథి పేరుతో ఈ అవార్డులను అందించనున్నారు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ నుండి విశాఖపట్నం గట్టి పోటీ ఇస్తుంది. దక్షిణాది నుండి ఏకైక జిల్లాగా ఉన్న విశాఖ అవార్డును సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఈ అవార్డు ఫలితాలు ఈ నెల చివర్లో రాబోతున్నాయి.