Begin typing your search above and press return to search.

టికెట్ ఖరారు అంటున్న టీజీ - ఎస్వీ ఏం చేస్తారో!

By:  Tupaki Desk   |   16 March 2019 4:09 AM GMT
టికెట్ ఖరారు అంటున్న టీజీ - ఎస్వీ ఏం  చేస్తారో!
X
తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసే రెండో జాబితాలో తన తనయుడి పేరు ఉంటుందని ప్రకటించారు కర్నూలు జిల్లా టీడీపీ నేత టీజీ వెంకటేష్. తన తనయుడు టీజీ భరత్ కు కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ఖరారు అయ్యిందని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ జాబితా విడుదల కాకుండానే.. టీజీ ఈ విధంగా విశ్వాసం వ్యక్తం చేయడం విశేషం. కర్నూలు ఎమ్మెల్యే టికెట్ విషయంలో టీడీపీలో ఉన్న గొడవ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.

ఈ టికెట్ విషయంలో టీజీ - ఎస్వీ మోహన్ రెడ్డిల మధ్యన పోరు తీవ్రంగా ఉంది. చాన్నాళ్ల నుంచినే అందుకు సంబంధించిన రచ్చ సాగుతూ ఉంది. అప్పట్లో నారా లోకేష్ బాబు మాట్లాడుతూ..కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డే పోటీ చేస్తారని ప్రకటించి గొడవకు తెర లేపారు. ‘అసలు అభ్యర్థులను ప్రకటించడానికి లోకేష్ ఎవరు?’ అనేంత స్థాయిలో మాట్లాడారు టీజీ వెంకటేష్.

ఇక ఇప్పుడు అయితే ఒకటే చెబుతున్నారట..అభ్యర్థిత్వం ఖరారు చేస్తే తెలుగుదేశం పార్టీలో ఉండటం - లేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవడం.. అని అంటూ ఉన్నారట వీళ్లు. అయితే మరోవైపు నుంచి ఎస్వీ మోహన్ రెడ్డి ఒత్తిడి కూడా గట్టిగా ఉంది. కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన టికెట్ ను ఆశిస్తూ ఉన్నారు.

ఎస్వీ మోహన్ రెడ్డిని కూడా చంద్రబాబు నాయుడు పూచిక పుల్లలా తీసేయలేకపోతూ ఉన్నారు. మోహన్ రెడ్డి ని పోటీ చేయించడం గురించి కూడా బాబు సమాలోచనలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో టీజీ మాట్లాడుతూ.. టికెట్ తన తనయుడికే ఖరారు అయ్యిందని ప్రచారం చేసుకుంటున్నారు. రెండో జాబితాలో మొదటి పేరు తన తనయుడిదే అనేంత స్థాయిలో ఈయన హడావుడి చేస్తూ ఉన్నారు.

ఇది సహజంగానే ఎస్వీ మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతూ ఉంది. తమ వాళ్లందరికీ టికెట్ లు ఖరారు చేయాల్సిందే అని ఇటీవలే మంత్రి భూమా అఖిలప్రియ కూడా బాబుకు తేల్చి చెప్పారట. మరి ఇంతకీ కర్నూలు సీటు విషయంలో చంద్రబాబు ఏం తేలుస్తారో!