Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే అయ్యుండి ఎందుకంత భయం..మాజీ ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   28 Jan 2020 10:33 AM GMT
ఎమ్మెల్యే అయ్యుండి ఎందుకంత భయం..మాజీ ఎమ్మెల్యే!
X
కర్నూల్ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కర్నూల్ నియోజకవర్గం నుండి హఫీజ్‌ ఖాన్‌ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి కూడా వైసీపీ లోనే కొనసాగుతున్నారు. అయన గత ఎన్నికల సమయంలో వైసీపీ ఎమ్మెల్యే గా గెలిచినప్పటికీ - ఆ తరువాత టీడీపీ ఆకర్ష్ లో భాగంగా టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆ తరువాత సార్వత్రిక ఎన్నికల సమయంలో మళ్లీ యూ టర్న్ తీసుకోని వైసీపీలో చేరారు. అయితే , ఆ సమయంలో సీఎం జగన్ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదు. అయినప్పటికీ కూడా ఒక సామాన్య కార్యకర్తలా వైసీపీ గెలుపుకి కృషి చేస్తానని అన్నారు. కర్నూల్ నుండి వైసీపీ తరపున పోటీ చేసిన హఫీజ్‌ ఖాన్‌ ఎమ్మెల్యే గా గెలుపొందారు. అప్పటి నుండి కూడా ఈ ఇద్దరి మధ్య పెద్దగా సఖ్యత లేదు అని రాజకీయ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.

ఇక ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల ముందు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి సమక్షం లో కొంతమంది వైసీపీలోకి చేరారు. ఇదే విషయమై ఇప్పుడు ఇద్దరి మధ్య మరో వివాదానికి దారితీసింది. కొందరు టీడీపీ నేతలని ఎస్వీ మోహన్‌ రెడ్డి వైసీపీలోకి ఆహ్వానించడంతో ఎమ్మెల్యే గా నేను ఉండగా మీరు ఎలా పార్టీలోకి ఆహ్వానిస్తారంటూ ,అలాగే వైసీపీలో తన అనుమతి లేకుండా కార్యకర్తల చేరికలు చెల్లవంటూ ఆయనకి ఎమ్మెల్యే ఒక లేఖని రాసారు.

తాజాగా దానిపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి ..పార్టీ బలోపేతానికే వైసీపీలోకి ఆహ్వానిస్తున్నామని , మరో ఉద్దేశం ఏమి లేదు అని తెలిపారు. స్థానిక ఎన్నికల దృష్ట్యా కార్యకర్తల బలం పార్టీకి చాలా అవసరమని తెలియజేసారు. కర్నూల్ శాసనసభ్యుడిగా హఫీజ్‌ ఖాన్‌ ఎన్నికయ్యారని - రాబోయే నాలుగేళ్ళు ఆయనే ప్రజాప్రతినిధిగా ఉంటారని - ఇలాంటప్పుడు ఆయనకి అభద్రత ఎందుకని ప్రశ్నించారు. పార్టీలో చేరుతున్న వాళ్లెవరూ సభ్యత్వాలు - పదవులను ఆశించి రావడంలేదని తెలిపారు. పార్టీలో చేరుతున్న వారిలో కర్నూల్ వారే కాకుండా ఆళ్లగడ్డ - పత్తికొండ - ఆలూరు - ఎమ్మిగనూరు - మంత్రాలయం తదితర నియోజకవర్గాలకి చెందిన వారు కూడా ఉన్నారని అన్నారు.

అలాగే ఇదే సందర్భంలో ఎమ్మెల్యే పై పరోక్షంగా కొన్ని కామెంట్స్ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వేల నుంచి 25 వేల మెజార్టీతో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారని, అయితే కర్నూలులో మాత్రం వైసీపీకి కేవలం 5వేల మెజార్టీ మాత్రమే వచ్చిందని తెలిపారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తాము ఇంట్లో కూర్చునే వ్యక్తులం కాదని - చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానన్నా టీడీపీని వదిలి వచ్చామని గుర్తు చేశారు, అతి త్వరలో స్థానిక ఎన్నికలు ఉన్న సమయంలో టీ కప్పులో తుపాను వంటి వివాదాలు పార్టీకి మంచివి కాదని, ఏవైనా ఉంటే పార్టీ రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకెళ్లి మాట్లాడాలని అన్నారు.