Begin typing your search above and press return to search.

క‌ర్నూలు కోర్టుకు వ‌ర్మ‌ను ర‌ప్పిస్తాడ‌ట‌!

By:  Tupaki Desk   |   27 Dec 2018 10:52 AM GMT
క‌ర్నూలు కోర్టుకు వ‌ర్మ‌ను ర‌ప్పిస్తాడ‌ట‌!
X
చంద్ర‌బాబు వ‌ర్సెస్ రాంగోపాల్ వ‌ర్మకు సంబంధించిన ఎపిసోడ్‌లో క‌ర్నూలు టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డి ఎంట‌ర్ కావ‌టం.. వ‌ర్మ‌పై ఆయ‌న నిప్పులు చెర‌గ‌టం తెలిసిందే. వ‌ర్మ తీస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ కుసంబంధించి ఇటీవ‌ల విడుద‌ల చేసిన పాట సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఈ పాట‌పై తెలుగు త‌మ్ముళ్లు ఓ రేంజ్లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. పెద్ద ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు.

ఇదిలా ఉంటే.. వ‌ర్మ విడుద‌ల చేసిన పాట వెనుక కుట్ర ఉంద‌ని చెబుతున్న టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డి.. తాజాగా వ‌ర్మ‌ను క‌ర్నూలు కోర్టుకు వ‌చ్చేలా చేస్తాన‌ని చెబుతున్నారు. వ‌ర్మ‌పై తాను వేసిన పిటిష‌న్ పై చేసిన వ్యాఖ్య‌ల్ని త‌ప్పు ప‌డుతూ.. త‌న‌కు పిటిష‌న్ వేసే అర్హ‌త లేద‌ని వ‌ర్మ ఎలా చెబుతార‌ని ప్ర‌శ్నించారు.

త‌మ ముఖ్య‌మంత్రి త‌ర‌ఫున పోరాడేందుకు ఎమ్మెల్యేగా త‌న‌కు హ‌క్కు ఉంద‌న్న ఎస్వీ.. వ‌ర్మ‌ను క‌ర్నూలు కోర్టు బోనులో నిల‌బెడ‌తాన‌ని చెప్పారు. వ‌ర్మ‌కు వారెంట్ ఇవ్వాల‌ని ఇప్ప‌టికే కోర్టులో పోలీసులు పిటిష‌న్ దాఖ‌లు చేశార‌ని..కోర్టు నుంచి అనుమ‌తి వ‌చ్చినంత‌నే పోలీసుల చ‌ర్య ఉంటుంద‌న్నారు. ఇంత‌కీ.. టీడీపీ ఎమ్మెల్యేల్లో ఎవ‌రికి లేని ఉలుకు మీకే ఎందుకు బాసూ? అంటూ క్లోజ్ గా ఉన్నోళ్లు అడిగితే ఎస్వీ ఇస్తున్న స‌మాధానం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

నాడు ఎన్టీఆర్ వ‌ద్ద‌కు బాబు త‌ర‌ఫున వెళ్లిన త్రిస‌భ్య క‌మిటీలో త‌న తండ్రి కూడా ఉన్నార‌న్న విష‌యాన్ని ఎస్వీ మోహ‌న్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. ల‌క్ష్మీపార్వ‌తిని ప‌క్క‌న పెట్టేందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేద‌ని.. ఆ స‌మ‌యంలో టీడీపీని ర‌క్షించుకోవ‌టం కోస‌మే బాబును ఎమ్మెల్యేలు బ‌ల‌వంతంగా ఒప్పించిన‌ట్లుగా చెప్పారు.

ఆ రోజు తాను కూడా వైస్రాయ్ హోట‌ల్లో ఉన్న‌ట్లు చెబుతున్న ఎస్వీ.. కొన్ని ప్ర‌శ్న‌ల‌కు క్లారిటీ ఇస్తే బాగుంటుంద‌ని చెప్పాలి. త‌న తండ్రి త్రిస‌భ్య క‌మిటీలో ఉన్నారు కాబ‌ట్టి తాను మాట్లాడుతున్న‌ట్లు చెబుతున్న ఎస్వీ మోహ‌న్ రె్డ్డి.. త‌న తండ్రిని చేత ఇదే విష‌యాన్ని చెప్పిస్తే బాగుంటుంది క‌దా?

వైస్రాయ్ హోట‌ల్లో తాను ఉన్న‌ట్లు చెబుతున్న మోహ‌న్ రెడ్డి.. అప్ప‌ట్లో ఆయ‌న వ‌య‌సు ఎంత‌? త‌న తండ్రి జోరుగా రాజ‌కీయాలు చేస్తున్న వేళ‌.. ఎస్వీ మోహ‌న్ రెడ్డి ఎలా ఉండే వార‌న్నది మ‌రో క్వ‌శ్చ‌న్ గా ఉంది. ఎన్టీఆర్‌ను ప‌ద‌వీచ్యుతుడ్ని చేసిన ఎపిసోడ్‌కు సంబంధించిన విష‌యాల్ని మోహ‌న్ రెడ్డి కంటే కూడా ఆయ‌న తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి చేత ప్రెస్ మీట్ పెట్టించి చెప్పించే ద‌మ్ము ఉందా? అన్న కొంద‌రి ప్ర‌శ్న‌ల‌కు బదులు చెబితే బాగుంటుంద‌న్న మాట వినిపిస్తోంది.