Begin typing your search above and press return to search.

ఫ్లై ఓవర్ పై బోల్తా పడ్డ సీఎం కాన్వాయ్ కారు ..!

By:  Tupaki Desk   |   1 Jan 2020 7:06 AM GMT
ఫ్లై ఓవర్ పై బోల్తా పడ్డ సీఎం కాన్వాయ్ కారు ..!
X
కర్ణాటక ముఖ్య మంత్రి బీఎస్‌ యడ్యూరప్ప కాన్వాయ్‌ లో ని ఇన్నోవా కారు బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్ వినయ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. కాన్వాయ్ యశవంతపురం ఫ్లై ఓవర్ పై నుండి అతివేగంతో వెళ్తున్న సమయం లో అదుపుతప్పి బోల్తా కొట్టింది. అనంతరం డివైడర్‌ను ఢీకొట్టి అటువైపు రోడ్డుకు వెళ్లి ఆ రోడ్డులో ప్రయాణిస్తున్న ఆటోను, అనంతరం వ్యాన్ ను ఢీకొట్టి నిలిచిపోయింది. ఆటో ని ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు గాయపడ్డారు.

పూర్తి వివరాలు చూస్తే.. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో సీఎం యడ్యూరప్ప, ఆయన కార్యదర్శి సెల్వకుమార్‌ తుమకూరు బయలుదేరారు. సీఎం యడియూరప్ప తో పాటు సెల్వకుమార్‌ ఒకే కారులో కూర్చున్నారు. కార్యదర్శితో మాట్లాడాల్సి ఉండడంతో సీఎం ఆయనను తన కారులో కూర్చోబెట్టుకున్నారు. దీంతో సెల్వకుమార్ కారు ఖాళీగా కాన్వాయ్ లో ప్రయాణిస్తోంది. యశవంతపుర ఉపరితల వంతెనపై అతివేగంతో వచ్చి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. మొత్తంగా ఈ ఘటన లో ఇన్నోవా డ్రైవర్ తో పాటుగా మరో ఇద్దరు కూడా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రి కి తరలించారు. ఇన్నోవా ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఎయిర్‌బ్యాగు తెరచుకోవడంతో డ్రైవర్‌ గాయాలతో బయటపడ్డాడు. అయితే అతి వేగం కారణంగానే వాహనం అదుపు తప్పి బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం తో అరగంట పాటు వాహనాల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం అనంతరం సీఎం యథావిధిగా తుమకూరు వెళ్లిపోయారు.