Begin typing your search above and press return to search.

సర్వే ఫలితం: 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు ఎవరిందంటే?

By:  Tupaki Desk   |   4 Sep 2021 3:30 AM GMT
సర్వే ఫలితం: 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు ఎవరిందంటే?
X
వచ్చే ఏడాదిలో ఐదు కీలక రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలు క్వార్టర్ ఫైనల్స్ గా చెప్పాలి. కీలకమైన యూపీతో పాటు.. పంజాబ్.. గోవా.. ఉత్తరాఖండ్.. మణిపూర్ అసెంబ్లీలకు ఎన్నికలు జరనున్నాయి. దీనికి సంబంధించిన తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం ఏ రాష్ట్రంలో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని మదింపు చేశారు. ఏబీపీ న్యూస్ తో పాటు సి వోటర్ తో కలిసి ఈ సర్వేను నిర్వహించారు.

ఇంతకూ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏ రాష్ట్రంలో ఎవరికి అవకాశాలు ఉన్నాయన్న విషయంలో ఏం చెప్పారన్నది చూస్తే..

ఉత్తరప్రదేశ్

దేశంలో అతి పెద్ద రాష్ట్రంతో పాటు.. కేంద్రంలో పాగా వేయటానికి యూపీనే కీలకం. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న యోగి సర్కార్ కు అనుకూలంగా యూపీ వాసులు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఉత్తమ ముఖ్యమంత్రిగా యోగిని యూపీ ప్రజలు కోరుకుంటున్నట్లుగా తేలింది. సర్వే చేసిన వారిలో 40 శాతం మంది యోగికి అనుకూలంగా స్పందించినట్లుగా తెలిపింది.

అదే సమయంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పట్ల 27 శాతం మంది సానుకూలత ప్రదర్శిస్తే.. ఏ మాత్రం అవకాశం వచ్చినా ప్రధాని కుర్చీలో కూర్చోవాలన్న ఆశను చూపే మాయావతి (బీఎస్పీ) గ్రాఫ్ మరింతగా పడిపోయినట్లుగా తేలింది. ఆమెను యూపీ సీఎం కావాలని కేవలం 15 శాతం మందే కోరుకున్నట్లు తేలింది. కాంగ్రెస్ పార్టీ ఆశా కిరణంగా అభివర్ణించే ప్రియాంక వాద్రాను ముఖ్యమంత్రిగా కేవలం 3 శాతం మందే చెప్పటం గమనార్హం.

అయితే.. 2017లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీ 62 సీట్లను కోల్పోనుందని తెలుస్తోంది. అదే సమయంలో సమాజ్ వాదీ పార్టీకి ఇప్పుడున్న బలానికి అదనంగా మరో 65 సీట్లు గెలిచే వీలుందని పేర్కొంది. యూపీ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలు ఉన్నాయి. అధికారంలోకి రావాలంటే 202 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. తాజా అంచనాల ప్రకారం బీజేపీకి 259 సీట్ల నుంచి 276స్థానాలు.. సమాజ్ వాదీ పార్టీకి 109 నుంచి 117 స్థానాలు.. బీఎస్పీ 12 నుంచి 16 స్థానాలు.. కాంగ్రెస్ 3 నుంచి 7 స్థానాలు మాత్రమే గెలిచే వీలుందంటున్నారు. ఇతరులు 6 నుంచి 10సీట్లను సొంతం చేసుకునే వీలుందంటున్నారు.

పంజాబ్

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు కష్టకాలం ఖాయమంటున్నారు. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ సీఎంగా వ్యవహరిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ కు సీఎం అయితే బాగుంటుందని 22 శాతం మంది అభిప్రాయపడుతుండగా.. శరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ ను సీఎంగా 19 శాతం మంది కోరుకుంటున్నారు. ప్రస్తుతం సీఎం అమరీందర్ర ను 18 శాతం మంది.. ఆఫ్ ఎంపీ భగవంత్ మన్ కు 16 శాతం.. నవజ్యోత్ సిద్ధూకు 15 శాతం మంది సానుకూలంగా ఉన్నారు.

ఉత్తరాఖండ్

ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వశం కానుంది. ఇటీవల సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ నేత ఫుష్కర్ సింగ్ దామీకి 23 శాతం మంది మద్దతు పలికితే.. అందుకు భిన్నంగా కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ కు 31 శాతం మంది తమ మద్దతును తెలిపారు.

గోవా

ప్రస్తుతం ఈ రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం బీజేపీ నేత ప్రమోద్ సావంత్ సీఎంగా ఉన్నారు. ఆయనే మరోసారి సీఎం కావాలని గోవా ప్రజలు కోరుకుంటున్నారు. 33 శాతం మంది ఆయన్ను సీఎం చేయటానికి మక్కువ చూపించటం గమనార్హం. ఈ రాష్ట్రంలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి సీఎం కావాలని 14 శాతం మంది కోరుకుంటున్నారు.

మణిపూర్

ప్రస్తుతం ఈ రాష్ట్రంలో బీజేపీ పవర్లో ఉంది. తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం బీజేపీకే మరోసారి గెలుపు అవకాశాలు ఉన్నాయి. 40.5 శాతం మంది మణిపూర్ లో బీజేపీకి పట్టకట్టేందుకు మక్కువ చూపుతున్నారు. విపక్షంలో ఉన్న కాంగ్రెస్ కు 34.5 శాతం మంది ఓటర్లు అండగా నిలిచారు. మొత్తంగా చూస్తే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి ఒక్క ఉత్తరాఖండ్ తప్పించి.. మరెక్కడా ముప్పు లేదు. కాంగ్రెస్ పవర్లో ఉన్న పంజాబ్ లో దెబ్బ తగలనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ.. గుర్రం ఎగరావచ్చు మాదిరి గెలుపు బాట పడితే.. అదో సంచలనంగా మారే అవకాశం ఉంది.