Begin typing your search above and press return to search.

ఆర్మీ గురించి ఇలా మాట్లాడారేంటి యోగీ

By:  Tupaki Desk   |   26 Dec 2017 6:44 PM GMT
ఆర్మీ గురించి ఇలా మాట్లాడారేంటి యోగీ
X
ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పదే పదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్థాన్‌ చర్యలకు ప్రతీకారంగా జరిపే సర్జికల్ స్ట్రైక్స్ పై ఆయ‌న చర్చనీయాంశ వ్యాఖ్య‌లు చేశారు.గత శనివారం పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత జవాన్లపై కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందారు. ఈ ఘటనపై స్పందిస్తూ విలేకరులతో మాట్లాడిన యోగి పాకిస్తాన్‌ను హెచ్చ‌రించారు.

గత సంవత్సరం సెప్టెంబర్‌లో భారత ఆర్మీ పాక్‌లో సర్జికల్‌ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. 2016 సెప్టెంబర్‌ 28 అర్ధరాత్రి సమయంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు మెరుపు దాడి చేశాయి. దాదాపు ఐదున్నర గంటల పాటు ఈ ఆపరేషన్‌ జరిగింది. ఈ దాడుల్లో కొందరు ఉగ్రవాదులు చనిపోవడం అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా పాక్ మ‌రోమారు కెలికిన నేప‌థ్యంలో.. సర్జికల్‌ స్ట్రైక్స్ వంటి దాడులు మళ్లీ మళ్లీ జరుగుతాయ్‌ అంటూ పాకిస్థాన్‌ను హెచ్చరించారు. భార‌త్ మంచిత‌నాన్ని చేత‌కానిత‌నంగా బావించ‌వ‌ద్ద‌న్నారు.

ఇదిలాఉండ‌గా...జమ్మూకశ్మీర్‌లోని కేరీ సెక్టార్‌లో పాక్ విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడింది. అక్కడ భారత బలగాలు ఆ కాల్పులను తిప్పికొట్టాయి. దాంతో ముగ్గురు పాక్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది యూరీ దాడికి ప్రతీకారంగా జరిపిన సర్జికల్ దాడుల తరహాలో భారత ఆర్మీ ఎల్వోసీ దాటి పాక్ దళాలకు బుద్దిచెప్పాయి. కాగా, ఎల్వోసీలోకి ప్రవేశించి పాక్ సైనికులను హతమార్చిన భారతీయ ఆర్మీ ఆ ఆపరేషన్‌ను లోకలైజ్డ్ టాక్టికల్ లెవల్ ఆపరేషన్‌గా పేర్కొన్నది. స్థానికంగా ఆ ప్రాంతంలో ఉండే ఆర్మీ కమాండర్ ఆ ఆపరేషన్‌ను నిర్వహిస్తాడు. అధికారుల సమాచారం ప్రకారం సుమారు పది మంది ప్రత్యేక దళానికి చెందిన భారతీయ సైనికులు లైన్ ఆఫ్ కంట్రోల్‌ను దాటి కాల్పులు జరిపారు. సోమవారం పూంచ్ సెక్టార్ ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ కాల్పుల్లోనే ముగ్గురు పాక్ సైనికులు మృతిచెందారు. రాజౌరిలో శనివారం పాక్‌కు చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ జరిపిన దాడిలో నలుగురు భారతీయ సైనికులు మృతిచెందారు. ఆ ఘటనకు ప్రతీకారంగా ఈ దాడులు చేశారు. అయితే ఈ ఆపరేషన్‌ను సర్జికల్ దాడిగా అధికారులు వర్ణించలేదు. కేవలం ఎంపిక చేసిన టార్గెట్‌ను మాత్రమే నిర్వీర్యం చేసినట్లు అధికారులు చెప్పారు. చాలా స్పష్టమైన లక్ష్యాలను ఈ ఆపరేషన్ ద్వారా ఛేదిస్తారు. అయితే రాత్రి నిర్వహించిన దాడిలో భారతీయ సైనికులు ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు. భారత దళాలపై దాడి చేస్తే, ప్రతీకారం ఇలాగే ఉంటుందన్న సంకేతాలను అందించాలన్న ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు చెప్పారు.