Begin typing your search above and press return to search.

రోజా ఇష్యూ మీద మాజీ స్పీకర్ ఏమన్నారు?

By:  Tupaki Desk   |   19 March 2016 4:39 AM GMT
రోజా ఇష్యూ మీద మాజీ స్పీకర్ ఏమన్నారు?
X
అంపైర్ పాత్ర పోషించటం కత్తి మీద సామే. ఇక.. ఆ అంపైర్ అధికారపక్షానికి చెందిన వాడై.. విపక్షసభ్యుల మనసు దోచుకోవటం చిన్న విషయం కాదు. అలాంటి క్లిష్టమైన బాధ్యతపై తనదైన ముద్ర వేసిన వ్యక్తి.. మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి. చట్టసభల్లో స్పీకర్ పదవిని చేపట్టటం చాలా క్లిష్టమైన పని. ఇక.. ఆ పదవిలో ఉంటూ.. ఆ స్థానానికి ప్రత్యేక గౌరవం కలిగేలా వ్యవహరించటం మామూలు విషయం కాదు. సమకాలీన రాజకీయాల్లో దూకుడు ఎక్కువైన పరిస్థితుల్లో స్పీకర్ గా బాధ్యత చేపట్టి.. వివాదరహితంగా వ్యవహరిస్తారన్న క్రెడిట్ కొద్దిమందికి మాత్రమే సాధ్యమైంది. అలాంటి వారిలో ఒకరు మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి.

తాజాగా.. ఏపీలో విపక్ష ఎమ్మెల్యే ఆర్కే రోజా ఉదంతంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో.. స్పీకర్ తీసుకుంటున్న నిర్ణయాలు.. వాటి పరిణామాలు.. తదితర అంశాల మీద సురేశ్ రెడ్డి ఒక ఛానల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రోజా ఇష్యూలో పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ.. ఈ వ్యవహారంలో స్పీకర్ పాత్ర కీలకభూమిక పోషిస్తుందనే చెప్పాలి. మరి.. ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహించిన పేరుప్రఖ్యాతులు సొంతం చేసుకున్న మాజీ స్పీకర్ వ్యాఖ్యలు కచ్ఛితంగా ఆసక్తిని రేకెత్తిస్తాయనే చెప్పాలి. ఇంతకీ.. రోజా ఇష్యూలో సురేశ్ రెడ్డి ఎలా స్పందించారన్నది చూస్తే..

‘‘శాసనసభపై శాసన సభ్యులకు గౌరవం ఉండాలి. సభ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని శిరసా వహించాలి. తమకు అన్యాయం జరిగిందని ఎవరైనా శాసనసభ్యుడు భావిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు ఉంటుంది’’

‘‘చట్టంపై శాసనసభకు గౌరవం ఉండాలి. చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. ఇలాంటి సందర్భాల్లో స్పీకర్ కీలకం అవుతారు. స్పీకర్ నైతికత ఇలాంటి సందర్భాల్లోనే వివాదం రేగుతుంది’’

‘‘ప్రత్యేక వివాదాలు రేగినప్పుడు స్పీకర్ కు ఉన్న అధికారాలను ఎలక్షన్ కమీషన్ కు అప్పగించాలని పెద్ద చర్చ నడిచిన విషయాన్ని మర్చిపోకూడదు. ప్రత్యేక వివాదాలు చెలరేగినప్పుడు స్పీకర్ పెద్దన్న పాత్ర పోషించాలి’’

‘‘ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న వివాదం పరువు ప్రతిష్ఠల వివాదంగా మారింది. అసెంబ్లీ విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ రోజా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించే అధికారం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వమే కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తే.. అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది’’

‘‘సభ మీద సభ్యులకు ఎలాంటి గౌరవం ఉండాలో.. చట్టం మీద సభకు గౌరవం ఉండాలి. ఈ ప్రత్యేక వివాదంలో చాలానే కోణాలు ఉన్నాయి. వీటిని మీడియా దగ్గర చర్చ జరిపేకంటే.. ఏపీ అసెంబ్లీలో చర్చ తర్వాత ఏం జరుగుతుందో చూడటం మంచిది’’