Begin typing your search above and press return to search.

కృతజ్ఞతలు చెబితే సరిపోదు.. రైల్వే జోన్ ఇవ్వాలి

By:  Tupaki Desk   |   15 Jun 2016 6:56 AM GMT
కృతజ్ఞతలు చెబితే సరిపోదు.. రైల్వే జోన్ ఇవ్వాలి
X
మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా కేంద్ర రైల్వే మంత్రి - బీజేపీ నేత సురేష్ ప్రభును ఏపీ కోటాలో టీడీపీ మద్దతుతో రాజ్యసభకు పంపించిన సంగతి తెలిసిందే. అంతకుముందు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆమె స్థానంలో ఈసారి సురేష్ ప్రభుకు ఏపీ నుంచి అవకాశం ఇచ్చారు. దీంతో తనను రాజ్యసభకు పంపించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతూ సురేశ్ ప్రభు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన చంద్రబాబును ఒక రేంజిలో పొగిడేశారు. ఏపీకి సేవ చేయడం తన అదృష్టమని అన్నారు.

రైల్వే మంత్రిగా ఉన్న తనకు రాజ్యసభ సభ్యుడిగా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ - బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా - సీఎం చంద్రబాబు - కేంద్ర మంత్రి వెంకయ్య - టీడీపీ - బీజేపీ ఏపీ శాఖలు - ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ మొదలు పెట్టిన ఆయన తనపై విశ్వాసం ఉంచినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఏపీలో జాతీయ - అంతర్జాతీయ స్థాయి వ్యాపారాలు - పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి చేస్తానని.. రాజ్యసభ సభ్యుడిగా ఏపీ సమస్యలను సభలో లేవనెత్తుతానని చెప్పారు. ఏపీ అభివృద్ధి బాటలో పయనించేందుకు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. అయితే.. ఇన్ని మాటలు చెప్పిన ఆయన తన లేఖలో ఏపీ ప్రజల వాంఛ అయిన విశాఖ రైల్వే జోన్ ఊసెత్తలేదు.

విభజన తరువాత తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. అయితే.. ఇదిగోఅదిగో అంటూ చాలాకాలంగా రైల్వే మంత్రిత్వ శాఖ దానిపై కాలయాపన చేస్తోంది. గతంలో సురేశ్ ప్రభు విశాఖ వచ్చిన సమయంలో దానిపై ప్రకటన చేస్తారని భావించినా నిరాశే ఎదురైంది. తాజాగా ఏపీ నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపించడం వెనుక విశాఖ రైల్వే జోన్ అంశంపైనా చర్చ జరిగి ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు. కానీ.. ప్రభు లేఖలో మాత్రం అలాంటిదేమీ కనిపించలేదు. విశాఖ రైల్వే జోన్ గురించి మాట మాత్రంగా కూడా ఆయన ప్రస్తావించలేదు.