Begin typing your search above and press return to search.

కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్

By:  Tupaki Desk   |   18 Aug 2021 7:30 AM GMT
కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్
X
పెగాసస్ స్పైవేర్ వినియోగంపై కేంద్రానికి సుప్రీంకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. పెగాసస్ సాఫ్ట్ వేర్ వాడకంపై మంగళవారం విచారణ జరిగింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై కోర్టు విచారణ మంచిది కాదని కాబట్టి ఇలాంటి విషయాలను తాము బహిరంగపరిచేది లేదని కేంద్రం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టంగా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయమై సుప్రింకోర్టు విచారణలో జోక్యం చేసుకుని దేశ రక్షణకు సంబంధించిన అంశాలను అఫిడవిట్లో కానీ విచారణ సందర్భంగా కానీ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పింది.

అయితే ఇదే సందర్భంగా పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కేంద్రం వినియోగించిందా ? ప్రతిపక్ష నేతలు, దేశంలోని ప్రముఖల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేసిందా అన్న విషయాన్ని మాత్రం కేంద్రం స్పష్టం గా చెప్పాల్సిందే అని గట్టిగా ఆదేశించింది. అంటే విచారణ సందర్భంగా కేంద్రానికి సుప్రింకోర్టు ఓ విషయంలో రక్షణగా నిలిచినా మరో విషయంలో మాత్రం గట్టిగా నిలదీస్తోంది. ఇక్కడే కేంద్రానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది.

మంగళవారం విచారణలో చెప్పినట్లుగా పెగాసస్ స్పైవేర్ అంశంపై ముందు ముందు కూడా సుప్రీంకోర్టు గట్టిగా పట్టుబడితే నరేంద్ర మోడీ సర్కార్ కు ఇబ్బందులు తప్పవు. లేదా మధ్యలోనే సుప్రీంకోర్టు తన పట్టుని సడలించేస్తే కేంద్రానికి రిలీఫ్ దొరకుతుందనే చెప్పాలి. నిజానికి దేశ భద్రతకు, ముప్పుగా భావించిన వాళ్ళు, అనుమానితులు, తీవ్రవాదుల కదలికల కోసంతో పాటు ప్రభుత్వాన్ని అస్తిరపరుస్తున్నారన్న అనుమానంతో కొందరి ఫోన్లను ట్యాపింగ్ చేయడం ఎప్పటి నుంచో ఉన్నదే.

కాకపోతే అది పరిమితమైన సంఖ్యలోనే ఉండేది. కానీ ఇప్పటిలాగ ప్రతిపక్ష నేతల ఫోన్లతో పాటు వారి పీఏలు, పీఎస్ ల ఫోన్లు, కుటుంబసభ్యుల ఫోన్లు, శాస్త్రవేత్తలు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు, లాయర్లు, జడ్జీల్లాంటి వేలమంది ఫోన్లను ట్యాపింగ్ చేయటం ఎప్పుడూ లేదనే చెప్పాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నరేంద్రమోడీని ఎవరు నిలదీస్తున్నారని అనిపించినా వెంటనే వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని ది వైర్ మీడియా బయటపెట్టడం తోనే కేంద్రానికి సమస్య మొదలైంది. మరి పదిరోజుల తర్వాత వాయిదా పడిన విచారణలో కేంద్రం ఏం చెబుతుందో చూడాల్సిందే.