Begin typing your search above and press return to search.

ఫుల్‌ గా సెక్యూరిటీ ఉన్నా వ‌ద‌ల‌మ‌ని బెదిరింపు!

By:  Tupaki Desk   |   7 Aug 2015 9:38 AM GMT
ఫుల్‌ గా సెక్యూరిటీ ఉన్నా వ‌ద‌ల‌మ‌ని బెదిరింపు!
X
ముంబ‌యి కాల్పుల్లో వంద‌లాది మంది అమాయ‌కులు మ‌ర‌ణానికి కార‌ణ‌మైన యాకూబ్ మెమ‌న్‌కు ఉరిశిక్ష‌ను జులై 30న అమ‌లు చేయ‌టం తెలిసిందే. నిజానికి.. యాకూబ్ మెమ‌న్ ఉరిశిక్ష‌కు మూడు గంట‌ల ముందు వ‌ర‌కూ కూడా చాలా నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టం తెలిసిందే.

ఎప్పుడూ లేనిది.. సుప్రీంకోర్టు తెల్ల‌వారుజామున త‌లుపులు తెరిచి మ‌రీ.. ఈ కేసుకు సంబంధించి చివ‌రిక్ష‌ణంలో పెట్టుకున్న ద‌ర‌ఖాస్తును కూడా ప‌రిశీలించి.. ఉరి ప‌క్కా అని తేల్చ‌టం తెలిసిందే. 1993 ముంబ‌యి బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి వివిధ ద‌శ‌ల్లో ఆయ‌న్ను ర‌క్షించేందుకు చాలానే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి.

అయితే.. ఉరిశిక్ష అమలును ఆపాలంటూ క్ష‌మాభిక్ష పిటీష‌న్‌ను పెట్టుకున్న యాకూబ్ మెమ‌న్ ద‌ర‌ఖాస్తును సుప్రీం న్యాయ‌మూర్తి దీప‌క్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం కొట్టేయ‌టం తెలిసిందే. చివ‌ర‌కు రాష్ట్రప‌తి సైతం క్ష‌మాభిక్ష పిటీష‌న్ ను తిర‌స్క‌రించ‌టంతో.. దానిపై సాంకేతికంగా కొన్ని అంశాల్ని ఎత్తి చూపుతూ ఉరిని ఆపాల‌ని కోర‌టంతో జులై 30 తెల్ల‌వారుజామున సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి సూచ‌న‌తో మ‌రోసారి.. దీప‌క్ మిశ్రాతో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం మ‌రోసారి విచారించి..చివ‌ర‌కు తెల్ల‌వారు జామున 3.30 గంట‌ల‌కు ఉరికి ఫైన‌ల్ గా ఓకే చెప్పేయ‌టంతో అత‌నికి ఊరిశిక్ష అమ‌లు అయ్యింది.

ఇదే స‌మ‌యంలో ఉరి తీర్పు ఇచ్చిన జ‌డ్జిల‌కు భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు.దీనిపై గుర్తు తెలియ‌ని దుండ‌గులు సుప్రీంకోర్టు జ‌డ్జి దీప‌క్ మిశ్రాకు ఒక లేఖ రాశారు. యాకూబ్ ఉరి నేప‌థ్యంలో.. ఆయ‌న కేసును విచారించిన న్యాయ‌మూర్తి దీప‌క్ మిశ్రాకు బెదిరింపు లేఖ ఒక‌టి అందింది.ఎంత భ‌ద్ర‌త మ‌ధ్య ఉన్నా.. తాము అత‌న్ని విడిచిపెట్ట‌మ‌ని హెచ్చ‌రించారు. ఈ ప‌ని ఎవ‌రు చేసి ఉంటారు? దీని వెనుక ఎవ‌రున్నార‌న్న విష‌యంపై పోలీసులు దృష్టి సారించారు. త్వ‌ర‌లోనే ఈ విష‌యాన్ని.. దీని వెనుక ఎవ‌రు ఉన్నార‌న్న విష‌యాన్ని తేలుస్తాన‌మి పోలీసుల చెబుతున్నారు.