Begin typing your search above and press return to search.

మూడుకోట్ల మంది నోటికాడి ముద్ద లాగేసిన బీజేపీ ప్ర‌భుత్వం.. సుప్రీం కోర్టు ఆగ్ర‌హం!

By:  Tupaki Desk   |   17 March 2021 12:22 PM GMT
మూడుకోట్ల మంది నోటికాడి ముద్ద లాగేసిన బీజేపీ ప్ర‌భుత్వం.. సుప్రీం కోర్టు ఆగ్ర‌హం!
X
రేష‌న్ కార్డుల విష‌యంలో కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై.. అత్యున్న‌త న్యాయ‌స్థానం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది. దేశ‌వ్యాప్తంగా బీజేపీ స‌ర్కారు ఒక‌టీ రెండు కాదు.. ఏకంగా మూడు కోట్ల రేష‌న్ కార్డుల‌ను ర‌ద్దు చేసింద‌ట‌. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ప‌రిగ‌ణించిన కోర్టు.. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశాలు జారీచేసింది.

ఆధార్ కార్డుతో లింకు కాలేద‌న్న కార‌ణంతో దేశంలోని 3 కోట్ల రేష‌న్ కార్డుల‌ను కేంద్రం ర‌ద్దు చేసింద‌ని, దీనిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోయిలీ దేవి వేసిన పిటిష‌న్ పై న్యాయ‌స్థానం విచార‌ణ చేప‌ట్టింది. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మ‌రీ దారుణంగా ఉంద‌ని కోర్టు వ్యాఖ్యానించింది.

మూడు కోట్ల రేష‌న్ కార్డులు ర‌ద్దు చేయ‌డం సామాన్య‌మైన విష‌యం కాద‌ని చీఫ్ జ‌స్టిస్ బొబ్డే, జ‌స్టిస్ బొప్ప‌న్నా, జ‌స్టిస్ సుబ్ర‌మ‌ణియ‌న్ ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. ఇంత‌మంది కార్డులు ర‌ద్దు చేయ‌డం, ప్ర‌జ‌లు ఆక‌లితో మ‌ర‌ణించ‌డం అనేది చిన్న స‌మ‌స్య కాద‌ని అన్నారు. ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకోవాల‌ని, కేంద్రం, రాష్ట్రాలు వెంట‌నే కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. అయితే.. ఆక‌లి కార‌ణంగా మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేద‌ని కేంద్రం తెలిపింది.