Begin typing your search above and press return to search.

విచారణ ఖైదీలని విడుదల చేయండి : సుప్రీం కోర్టు

By:  Tupaki Desk   |   24 March 2020 7:50 AM GMT
విచారణ ఖైదీలని విడుదల చేయండి : సుప్రీం కోర్టు
X
మొత్తం ప్రపంచంలోని మానవాళికి ముప్పుగా మారిన కరోనా వల్ల జైలులో ఉన్న ఖైదీలు కాస్త ఊరట చెందనున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జైళ్లలో ఖైదీల రద్దీని తగ్గించే అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ ఏ బోబ్డే, జస్టిస్‌లు ఎల్‌ ఎన్‌ రావు - సూర్యకాంత్‌ తో కూడిన ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ జరిపింది. దేశవ్యాప్తంగా జైళ్ల ఉన్న ఖైదీలను పెరోల్‌ లేదా మధ్యంతర బెయిల్‌ పై విడుదలకు ఉన్నతస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలకి - కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు సూచించింది.

దోషులుగా తేలి జైలు శిక్ష పడిన ఖైదీలు - ఏడేండ్ల వరకు జైలు శిక్ష అవకాశమున్న నేరాలకు పాల్పడిన రిమాండ్‌ ఖైదీల విడుదల అంశాన్ని పరిశీలించాలని తెలిపింది. నేర తీవ్రతను బట్టి ఖైదీలను కేటగిరీల వారిగా విభజించి పెరోల్‌ లేదా మధ్యంతర బెయిల్‌ పై విడుదలకు ఉన్నత స్థాయి కమిటీ ఆధ్వర్యంలో మార్గదర్శకాలు రూపొందించాలని సూచించింది. అలాగే కేసుల విచారణ నిమిత్తం రిమాండ్‌ ఖైదీలను కోర్టులకు - ఇతర జైళ్లకు తరలించడాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.

మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ అంశంలో కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా నేపథ్యంలో జైళల్లో ఖైదీల రద్దీని తగ్గించేందుకు దోషులు - రిమాండ్‌ ఖైదీలను ప్రత్యేక పెరోల్‌ లేదా ఫర్‌లో కింద విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఢిల్లీ హైకోర్టుకు సోమవారం తెలిపిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటివరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 492 కి చేరింది. వీరిలో 37 మంది ఇప్పటికే కరోనా నుండి కోలుకోగా - మిగిలిన వారు చికిత్స తీసుకుంటున్నట్టు కేంద్రం ప్రకటించింది. అలాగే ఇప్పటివరకు భారత్ లో కరోనా వల్ల 9 మంది మరణించారు. దీనితో సుప్రీం కోర్ట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.