Begin typing your search above and press return to search.

ఓటుకు నోటు కేసులో సుప్రీం కీలక ఆదేశాలు!

By:  Tupaki Desk   |   23 Sept 2016 12:12 PM IST
ఓటుకు నోటు కేసులో సుప్రీం కీలక ఆదేశాలు!
X
గతంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఓటుకు నోటు కేసు. ఈ వ్యవహారం జరిగిన విదం మొత్తం టీవీల్లో సైతం కనిపించే సరికి ఒక్కసారిగా రాజకీయ అలజడి చెలరేగింది. ఆ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి సైతం ఈ విషయంపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అయితే ఈ విషయంపై తాజాగా సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ పై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ను ఆదేశించింది. ఆ సమయంలోగా హైకోర్టు ఏ నిర్ణయం వెలువరించని పక్షంలో పిటిషనర్ మరోసారి సుప్రీంకోర్టుకు రావచ్చని సుప్రీం కోర్టు తెలిపింది.

మొదలైనప్పటికి వేడి తర్వాతి కాలంలో తగ్గిందనో ఏమో కానీ.. ఓటుకు నోటు విషయంలో మరోసారి వార్తల్లో నిలిపారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ - ఏసీబీ కోర్టు విచారణపై హైకోర్టు ఇచ్చిన ఎనిమిది వారాల స్టేను సవాలు చేస్తూ ఆయన తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు.

ఈ సందర్భంగా వాదనలు వినిపించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తరుపు న్యాయవాది... ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారం ఇదని, తాము సమర్పించిన ఆధారాలతో ఏసీబీ కోర్టు సంతృప్తి చెందడం వల్లే ఈ కేసుపై పునర్విచారణకు ఆదేశించిందని, దానిపై స్టేను తొలగించేలా చూడాలని కోరారు. దీంతో... కేసు విచారణపై ఎనిమిది వారాల పాటు హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో కేసులో జోక్యం చేసుకోలేమని.. అయితే నాలుగు వారాల్లోగా కేసును పరిష్కరించాలని సుప్రీంకోర్టు తెలిపింది!