Begin typing your search above and press return to search.

ఎండ తీవ్రత తగ్గినా.. రెండు రాష్ట్రాల్లో 622 మృత్యువాత

By:  Tupaki Desk   |   26 May 2015 5:46 AM GMT
ఎండ తీవ్రత తగ్గినా.. రెండు రాష్ట్రాల్లో 622 మృత్యువాత
X
మండలే ఎండలు మందగించాయి. భగభగలాడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలు కొద్దిమేర శాంతించాయి. అయినప్పటికీ.. వేడి తీవ్రతకు.. వడదెబ్బ కారణంగా మృత్యువాత పడే వారి సంఖ్య మాత్రం భారీగానే కొనసాగుతుంది.

గత ఎనిమిది రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు చూస్తే.. ఆదివారం నాటికి ఏపీ కంటే తెలంగాణలో కొంత మేర ఎండ తీవ్రత తగ్గింది. ఇక.. సోమవారం మరికాస్త తగ్గుముఖం పట్టింది. భానుడి భగభగలున్నప్పటికీ.. రికార్డు స్థాయిలో 46..48 డిగ్రీలు మాత్రం నమోదు కాలేదు. అలా అని ఎండ లేకుండానూ లేదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల కారణంగా ప్రజల అవస్థలు తగ్గుముఖం పట్టలేదు. కాకుంటే.. గడిచిన వారంతో పోలిస్తే.. తీవ్రత మాత్రం కొంతమేర తగ్గిన పరిస్థితి. అదే సమయంలో వడగాల్పులు సైతం కాస్తంత తగ్గుముఖం పట్టాయి. ఏపీతో పోలిస్తే.. తెలంగాణ ప్రాంతంలో ఉష్ణోగ్రతల్లో కాస్త మార్పు వచ్చింది. ఇక.. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం మండుతోంది. సోమవారం ఏపీలో అత్యధికంగా రాజమండ్రి (48)..తాడేపల్లిగూడెం (48).. కాకినాడ (46.1).. గుంటూరు (46).. విజయవాడ (46).నమోదయ్యాయి.

అదే సమయంలో తెలంగాణలో.. ఏపీ స్థాయిలో కాకుండా మంట పుట్టించే ఎండలే కాచాయి. ఖమ్మం (46).. సూర్యాపేట (45).. కరీంనగర్‌ (45).. రామగుండం (45).. అదిలాబాద్‌ (44.3)... వరంగల్‌ (44) ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

అయితే.. రెండు రాష్ట్రాల్లోనూ ఎండల కారణంగా మృత్యుల సంఖ్య కాస్తంత భారీగానే నమోదైంది. ఒక్క సోమవారంలోనే.. తెలంగాణ వ్యాప్తంగా 232మంది మృతి చెందగా.. ఏపీలో 390 మంది మరణించారు.