Begin typing your search above and press return to search.

రూ.5000 కోసం మిట్ట‌ల్ ఏం చేశాడంటే

By:  Tupaki Desk   |   16 Dec 2017 5:25 PM GMT
రూ.5000 కోసం మిట్ట‌ల్ ఏం చేశాడంటే
X
రూ.7000 కోట్లు. ఇదేదో కంపెనీ విలువ కాదు. ప్ర‌ఖ్యాత మొబైల్ సేవ‌ల కంపెనీ అధినేత సునీల్ భార‌తీ మిట్ట‌ల్ ప్ర‌క‌టించిన దాతృత్వం మొత్తం. మిట్ట‌ల్ గ్రూప్‌ న‌కు చెందిన దాతృత్వ సంస్థ భారతి ఫౌండేషన్‌కు తమ సంపదలో పదిశాతం వాటాను విరాళానికి కేటాయించ‌నున్న‌ట్లు ఇటీవ‌ల‌ ప్ర‌క‌టించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. అయితే ఆయ‌న ఓ ఐదు వేల రూపాయ‌ల‌కు అష్ట‌క‌ష్టాలు ప‌డ్డారు. ఔను. కేవ‌లం ఐదువేల‌కే! త‌న జీవితంలోని ఈ కీల‌క ఘ‌ట్టాన్ని ఢిల్లీలో జరిగిన టైకాన్‌ సదస్సులో మాట్లాడుతూ ఆయన పంచుకున్నారు. సైకిల్‌ విడిభాగాల వ్యాపారాలకు ఓనర్‌గా ఉండే సునిల్‌ మిట్టల్ దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీ య‌జ‌మానిగా ఎదిగిన తన వ్యాపార ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను, ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు.

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త బ్రిజ్‌మోహ‌న్ లాల్ ముంజాల్‌ను ఆశ్ర‌యించి కేవ‌లం రూ.5000 అప్పు అడిగాన‌ని ....ఆ స‌మ‌యంలో త‌న‌కు తీవ్ర ఆర్థిక క‌ష్టాలు ఉండేవ‌ని మిట్ట‌ల్ గుర్తు చేసుకున్నారు. `అంకుల్ నాకో ఐదువేలు కావాలి` అని కోర‌గా...ఇన్‌ వాయిస్‌ లు తీసుకొని కావాల్సిన సొమ్ములు స‌ర్దుబాటు చేశార‌ని మిట్ట‌ల్ చెప్పారు. ఆ సంద‌ర్భంగా త‌న‌కు నేర్పిన పాఠం - మార్గ‌ద‌ర్శ‌కం గుర్తుంద‌న్నారు. `సునీల్‌..ఇప్పుడు తీసుకున్నావు స‌రే...ఇదే అల‌వాటు చేసుకోకు` అంటూ స్ప‌ష్టంగా త‌న స‌ల‌హా పూర్వ‌క‌మైన హెచ్చ‌రిక చేశార‌ని మిట్ట‌ల్ ఆనాటి ఉదంతాన్ని గుర్తుచేసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా త‌న జీవితంలో చేసిన త‌ప్పిదాల‌ను కూడా మిట్ట‌ల్ వెల్ల‌డించారు. ఆఫ్రికాలో అడుగుపెట్టాల‌నుకోవ‌డం తాను చేసిన త‌ప్పు అని ఆయ‌న తెలిపారు. తొంద‌ర‌పాటుతో తీసుకున్న ఆ నిర్ణ‌యం వ‌ల్ల తన వ్యాపారంలో ఇబ్బందులు త‌లెత్తాయ‌ని దాన్ని చ‌క్క‌దిద్దేందుకు తానెంతో శ్ర‌మించాల్సి వ‌చ్చింద‌న్నారు. కొన్ని కోట్ల రూపాయ‌లు - సుదీర్ఘ స‌మ‌యం కేటాయించాన‌ని మిట్ట‌ల్ వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా త‌ప్పు చేయ‌డం మాన‌వ స‌హ‌జ‌మ‌ని మిట్ట‌ల్ అన్నారు. ` అప్పుడు అలా చేసి ఉండాల్సింది కాదు అని ప్ర‌తి ఒక్క‌రు అనుకుంటారు. అలా చేయ‌డం స‌రికాద‌నే భావ‌న అంద‌రికీ ఉంటుంది. అయితే...చేసిన ప‌నిని స‌మీక్షించుకోవాలి. మ‌రింత ప‌క‌డ్బందీగా అడుగువేయాలి` అని మిట్ట‌ల్ వివ‌రించారు.