Begin typing your search above and press return to search.

బాబుగారు నాని లాగా నా బ‌తుకు రోడ్డు పాలు చేయ‌కండి

By:  Tupaki Desk   |   7 Aug 2017 4:35 PM GMT
బాబుగారు నాని లాగా నా బ‌తుకు రోడ్డు పాలు చేయ‌కండి
X
తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని మ‌రోమారు వివాదంలో చిక్కుకున్నారు. ఎంపీ నానిపై ఆయ‌న మాజీ వ్యాపార ప్ర‌త్య‌ర్థి ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎంపీ కేశినేని నానికి వ్యాపారం చేతకాక ఇతర వ్యాపారుల మీద కక్ష చేస్తున్నాడని మండిప‌డ్డారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో త‌మ‌ను రోడ్డున ప‌డేసేలా ఎంపీ నాని వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో త‌మ‌ బస్సు ప్రమాదం మార్చి 2017లో జరిగిందని ఆరెంట్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అయితే అన్ని అనుమతి పాత్రలు ఉన్నా పోలీసులు బస్ ఇవ్వటం లేదని ఆరోపించారు. ప్రజా సేవ చేయమని ఎంపీగా నానిని గెలిపిస్తే ఆయన త‌మ‌ మీద కక్ష సాధింపు చేస్తున్నారని మండిప‌డ్డారు. తాను కోర్టుకు వెళ్లినా కూడా నాని అధికారాన్ని ఉపయోగించి నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏప్రిల్ 20న రిలీజ్ ఆర్డర్ వచ్చినప్ప‌టికీ ఎంపీ ఒత్తిడి వల్ల త‌మ బస్సును విడుదల చేయలేదని ఆరోపించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసుల తీరుతో షాక్‌ కు గురైన తాము హైకోర్టుకు వెళ్ళామని సునీల్‌ కుమార్ రెడ్డి తెలిపారు. అయినా పోలీసులు కోర్టు ఉత్తర్వులను గౌరవించడం లేదని ఆరోపించారు. కోర్టు ఆర్డర్ తీసుకుని పోలీసు స్టేషన్ కి వెళ్తే త‌మ‌ సిబ్బంది మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ రోజు హైకోర్ట్ ఆదేశాల పత్రాలను పోలీసులకు ఇచ్చినా వాటిని తీసుకుని రసీదు ఇవ్వటానికి నిరాకరించారని అన్నారు. ఎంపీ కేశినేని నాని ఒత్తిడికి తలొగ్గి అధికారులు పని చేస్తున్నారని సునీల్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పోలీస్ కమిషనర్ ను కలిసి త‌మ ఆవేద‌న చెప్పుకోవాల‌ని చూస్తే ఆయన సమయం ఇవ్వటం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం కోరుతోందని అయితే ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యాలను ఆపాలని సీఎం చంద్రబాబును కోరుతున్నామ‌ని తెలిపారు.

ఎంపీ నాని మాదిరిగా సిబ్బందికి జీతాలు ఎగ్గొట్టి ఆఫీసుల ముందు ధర్నాలు చేయించుకునే దుస్థితికి తాను చేర‌కుండా చూడాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. కస్టమ్స్ శాఖకు నాని బకాయిల గురించి దరఖాస్తు చేస్తే ఆయన 10 కోట్లు సర్వీసు ట్యాక్స్‌ కట్టలేద‌ని తెలుస్తోంద‌ని సునీల్ కుమార్ రెడ్డి అనుమానం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బు నాని చెల్లించలేదని అన్నారు.