Begin typing your search above and press return to search.

ఏపీలో బీజేపీ 'పిచ్' రెడీ చేస్తోంది

By:  Tupaki Desk   |   2 Jun 2019 4:36 AM GMT
ఏపీలో బీజేపీ పిచ్ రెడీ చేస్తోంది
X
బీజేపీ పార్టీ వ్యూహాలకు కేరాఫ్ అడ్రస్ లా మారుతోంది. దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకుని ఒక్కో రాష్ట్రాన్ని తన వశం చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే దాదాపు 80 శాతం రాష్ట్రాల్లో తన ప్రతాపం చూపింది బీజేపీ. ఇపుడు బీజేపీ దృష్టి మొత్తం దక్షిణ భారతంపై పడింది.

ఒకవైపు మంచి మూలాలున్న తెలంగాణలో 2024 నాటికి బీజేపీని అధికారంలోకి తేవడానికి ఇప్పటికే అన్ని ప్రయత్నాలు రెడీ చేసుకున్న బీజేపీ... ఏపీలో తన వ్యూహరచన మొదలుపెడుతోంది. తమిళనాడు అంత త్వరగా చేతికి చిక్కడం కష్టం కాబట్టి... తెలుగు రాష్ట్రాలపై ఎక్కువ దృష్టి పెట్టింది బీజేపీ. ఈరోజు బీజేపీ ఒకేరోజు మూడు హింట్లు ఇచ్చేసింది. ఒకటి చంద్రబాబుకు జైలు తప్పదని - ఇంకోటి జగన్ తో మా ఫ్రెండ్ షిప్ తాత్కాలికమే అని - మూడోది ఏపీలో ఇక మేము కీలకం కానున్నామని చెప్పకనే చెప్పింది.

బీజేపీ టార్గెట్లను చేదించే ఏకే 47 వంటి ఇద్దరిని ఏపీకి పంపింది బీజేపీ పునాదులు ఏపీలో బలంగా వేయడానికి ఏడాది క్రితమే ఏపీకి వచ్చిన ఆ ఇద్దరు... మురళీధరన్ - సునీల్ దేవ్ ధర్. పొలం పంట వేయడానికి సిద్ధం చేసే ముందు దున్నేసి పిచ్చిమొక్కను పీకేసిన చందంగా... పార్టీని ఏపీలో బలపరచడానికి ముందు తెలుగుదేశం పార్టీని పతనం చేసే ప్రణాళికలో ఏడాది కాలంగా బిజీగా ఉన్నారు. వారి లక్ష్యం దాదాపుగా నెరవేరిన నేపథ్యంలో... ఇపుడు తమ భవిష్యత్తుకు పునాదులు వేయడం మొదలుపెట్టారు.

కొత్త సీఎం జగన్‌ పరిపాలనను ఏడాదిన్నరపాటు గమనిస్తామని - ఆ తర్వాత తమ పంథా ఏంటో చెబుతామని సునీల్ ధేవ్ దర్ వ్యాఖ్యానించారు. అంటే మెల్లగా వీలైతే సొంత పంథా లేదంటే.. పొత్తు దారి వెతుక్కోవడానికి ఆ పార్టీ ఏపీలో అస్త్ర శస్త్రాలు సిద్ధం చేస్తోంది. దీనికి బీజేపీ వాడుతున్న ఆయుధంలో కీలకమైన వ్యక్తి సునీల్ దేవ్ ధర్.

ఎవరీ సునీల్ దేవ్ ధర్?

సునీల్ దేవ్ ధర్ ది కేరళ అని చాాలామంది భావిస్తున్నారు. ఆయన మహారాష్ట్రకు చెందిన నేత. రాజకీయ వ్యూహనిపుణుడిగా మంచి పేరుంది. తెరవెనక వ్యూహాలను రచించడంలో దిట్ట. పైకి కనిపించేది తక్కువే. 2014 లోక్ సభ ఎన్నికల్లో మోడీ నియోజకవర్గం వారణాసి పార్లమెంటు నియోజకవర్గానికి సమన్వయ కర్తగా పనిచేశారు. దీన్ని బట్టి ఆయన సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2013 గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోట అయిన దాహార్ జిల్లాను బద్దలు కొట్టిన వ్యక్తి ఈయన. అపుడే ఆయన టాలెంటును అమిత్ షా గుర్తించారు. అందుకే ఏకంగా మోడీ నియోజకవర్గానికి ఇన్ ఛార్జిని చేశారు.

2014 లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దేవ్ ధర్ సీపీఎం కు పట్టున్న పాల్ఫర్ నియోజకవర్గాన్ని బీజేపీ ఖాతాలో వేశారు. అందుకే ఆయనను లోక్ సభ ఎన్నికల తర్వాత ఎన్నికలకు మూడేళ్ల ముందుగానే త్రిపురకు ఇన్ ఛార్జిని చేశారు. అక్కడా దేవ్ ధర్ సక్సెస్ అయిన విషయం మనందరికీ తెలిసిందే.

దేవ్ ధర్ కీలక ఆయుధం సోషల్ మీడియా. ఆ విషయంలో ఆయన చాలా పట్టు సాధించారు. అందుకే యాక్టివ్ గా ఉండే ఏపీకి ఏరికోరి అమిత్ షా దేవ్ ధర్ ను ఏపీకి సహాయ ఇన్ ఛార్జిగా నియమించారు. మరి కమలం కలను ఏపీలో దేవ్ ధర్ ఎంతవరకు నెరవేరుస్తాడో చూడాలి.