Begin typing your search above and press return to search.

బ్యాలెట్ లేదు.. ఈవీఎంలతోనే ఎన్నికలు

By:  Tupaki Desk   |   13 Feb 2019 10:18 AM GMT
బ్యాలెట్ లేదు.. ఈవీఎంలతోనే ఎన్నికలు
X
ఈవీఎంల మీదే వచ్చే సార్వత్రిక ఎన్నికలను నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు తాజాగా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించడానికి వచ్చిన సీఈసీ సునీల్ అరోరా తాజాగా ఇదే విషయంపై స్పష్టం చేశారు.

ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు సహా దేశంలోని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వారి అభ్యంతరాలను తోసిరాజని సీఈసీ ఈవీఎంలపైనే ఎన్నికలని కుండబద్దలు కొట్టారు.

ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు సీఎం చంద్రబాబు సహా చాలా మంది ప్రతిపక్ష నేతలు ఈవీఎంలపై ఎన్నికలు వద్దని సీఈసీ సునీల్ కు విన్నవించారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయని బాబు గారు ఫిర్యాదు చేశారు.

అయితే దేశంలో టెక్నాలజీకి అంకురార్పణ చేసింది తానేనని చెప్పుకునే చంద్రబాబు.. హైటెక్ సిటీని కట్టింది తానేనని చెప్పే బాబు.. ఈవీఎంలను మాత్రం శంకించడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. గత 2014 ఎన్నికల్లో కూడా ఇదే ఈవీఎంలపై బాబు నెగ్గిన మాట వాస్తవం కాదా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బాబు ఈవీఎంలంటేనే ఎందుకు భయపడుతున్నాడో అర్థం కావడం లేదంటున్నారు.

ఇంత రచ్చ జరుగుతున్న సమయంలోనే సీఈసీ మాత్రం ఈవీఎంలతోనే ఎన్నికలని తాజా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో స్పష్టం చేసి బాబుకు క్లారిటీ ఇచ్చారు. ఇక పక్షపాతంతో అధికారులు వ్యవహరిస్తున్న అధికారుల విషయంలో తాము చర్యలు తీసుకునే అవకాశం ఉందని సీఈసీ పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు పక్షపాతంతో వ్యవహరించవద్దని వారిపై కోడ్ అమల్లో ఉన్నప్పుడు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజీపీ నుంచి కలెక్టర్ వరకూ ఎవరైనా ఉపేక్షించమని తెలిపారు. ఏపీలో ఓట్ల తొలగింపుపై కూడా దృష్టి సారిస్తామని తెలిపారు. నామినేషన్ల చివరి రోజు వరకూ ఓటు నమోదుకు అవకాశం ఇస్తామని సీఈసీ సునీల్ స్పష్టం చేశారు.