Begin typing your search above and press return to search.

మోడీని టార్గెట్ చేశారేమి స్వామీ!

By:  Tupaki Desk   |   11 April 2015 1:01 PM GMT
మోడీని టార్గెట్ చేశారేమి స్వామీ!
X
ఇన్ని రోజులూ మహిళల విషయంలోనూ, సున్నితమైన అంశాలపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుబ్రహ్మణ్యస్వామి ఈ సారి ఏకంగా ప్రధాని నరేండ్రమోడీ పైనే నిప్పులు చెరిగి, పార్టీ పరంగా వివాదాస్పదమయ్యారు. ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న ప్రధాని, 36 రఫల్ యుద్ధ విమానాలు కనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయంపై ప్రధానికి అవగాహనలేదనుకున్నారో లేక అంతకంటే తనకే ఎక్కువ తెలుసనుకున్నారో కానీ... మోడీ నిర్ణయాన్ని తప్పుపట్టారు స్వామి.
రఫల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోడీ అహేతుకంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఫైర్ అయ్యారు. డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ రూపొందించే ఈ రఫల్ యుద్ధవిమానాలు అత్యంత పనికిమాలినవని, ప్రపంచంలోని మిగతా దేశాలేవీ కొనుగోలు చేసేందుకు ముందుకురాని విమానాలపై మోడీకి ఎందుకు అంత ఆసక్తో అర్థం కావడం లేదని నిప్పులు చెరిగారు. ఇదే సమయంలో రఫల్ గురించి మరికొన్ని ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు స్వామి. రఫల్ ఫైటర్ల ఇంధన సామర్థ్యం చాలా తక్కువ అని... ఇక పనితీరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని ఉన్నట్లుండి ఏకంగా మోడీకి గాలి తీసేశారు. అక్కడితో ఆగని సుబ్రహ్మణ్యస్వామి... ఈ విషయంలో ప్రభుత్వ మొండిగా వ్యవహరిస్తే కోర్టును ఆశ్రయిస్తానని మోడీ అండ్ కో కు హెచ్చరికలు పంపారు!