Begin typing your search above and press return to search.

సికింద్రాబాద్ అల్లర్ల కేసులో సంచలనాలు.. నోరువిప్పిన సుబ్బారావు!

By:  Tupaki Desk   |   24 Jun 2022 10:30 AM GMT
సికింద్రాబాద్ అల్లర్ల కేసులో సంచలనాలు.. నోరువిప్పిన సుబ్బారావు!
X
‘అగ్నిపథ్’ స్కీమ్ కు వ్యతిరేకంగా జరిగిన సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారిగా అభివర్ణించిన సుబ్బారావు నోరు విప్పినట్టు తెలిసింది. దీంతో ఈకేసులో మరిన్ని సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. సుబ్బారావును విచారిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసుల విచారణలో అతడు నోరు విప్పినట్టు తెలిసింది. తన అనుచరులతో కలిసి ఈ విధ్వంసానికి పథకం రచించినట్లు పోలీసులు తేల్చారు.

సుబ్బారావు ఈ అల్లర్లలో సూత్రధారి అని.. ‘శివ’, మల్లారెడ్డి, రెడ్డప్ప, హరి అనే నలుగురు అనుచరులతో కలిసి విద్యార్థులను రెచ్చగొట్టినట్టు పోలీసులు నిర్ధారించారు. సుబ్బారావు ఆదేశాలతోనే గ్రూపుల్లో ఆందోళనలు చేయాలని అనుచరులు పిలుపునిచ్చినట్లు సమాచారం.

గుంటూరు ర్యాలీ నుంచే ఆందోళనలకు సుబ్బారావు స్కెచ్ వేసినట్లు గుర్తించారు. నరేష్ అనే మరో అనుచరుడు ఆందోళనకారులకు భోజనం అందజేసినట్టు తేలింది. నరేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

జూన్ 16న సుబ్బారావు సికింద్రాబాద్ వచ్చాడని.. అదే రోజు హోటల్ లో అనుచరులతో భేటి అయ్యాడని తెలిసింది. ఈ భేటీలోనే విధ్వంసానికి భారీ ప్లాన్ వేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. సుబ్బారావు తెలిపిన సమాచారాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. మరికాసేపట్లో అతడిని అరెస్ట్ రిమాండ్ కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు ప్రధాన సూత్రధారి అని తేలింది. ఏపీకి చెందిన ఈ కోచింగ్ నిర్వాహకుడు తెలంగాణలోని హైదరాబాద్ లో సాయి కోచింగ్ సంస్థ పేరిట నిర్వహించి నిరుద్యోగులను రెచ్చగొట్టాడని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. పలు కీలక విషయాలు రాబట్టినట్టు తెలిసింది.

సికింద్రాబాద్ లో విధ్వంసానికి కారణమైన 46 మందిని అన్ని ఆధారాలతో అరెస్ట్ చేసినట్లు రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు. రైల్వే కేసులలో శిక్ష పడ్డ వారికి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావని.. వారి జీవితం నాశనమైనట్టేనని స్పష్టం చేశారు.రైల్వేస్టేషన్ పై దాడికి పాల్పడిన వారంతా తెలంగాణకు చెందిన నిరుద్యోగులేనని విచారణలో తేలింది. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా రైల్వే స్టేషన్ లో విధ్వంసం సృష్టించారు. ఈ్టస్ట్ కోస్ట్, దానాపూర్, అజంతా ఎక్స్ ప్రెస్ రైళ్లకు నిప్పు పెట్టారు. మొత్తం నాలుగు బోగీలను దగ్ధం చేశారు. 58 అద్దాలు పగులకొట్టారు.