Begin typing your search above and press return to search.

సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ విధ్వంసంలో సుబ్భారావు అరెస్టుకు రంగం సిద్ధం!

By:  Tupaki Desk   |   23 Jun 2022 4:46 AM GMT
సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ విధ్వంసంలో సుబ్భారావు అరెస్టుకు రంగం సిద్ధం!
X
కేంద్ర ప్ర‌భుత్వం సాయుధ ద‌ళాల్లో అగ్నిప‌థ్ ను ప్ర‌వేశ‌పెట్ట‌డాన్ని నిర‌సిస్తూ జ‌రిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ విధ్వంసంలో సాయిడిఫెన్స్ అకాడ‌మీ డైరెక్ట‌ర్ ఆవుల సుబ్బారావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన‌ను అరెస్టు చేయ‌డానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నార‌ని తెలుస్తోంది. అగ్నిపథ్‌ను నిరసిస్తూ యువ‌కులు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో సృష్టించిన విధ్వంసానికి సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావు మద్దతిచ్చారని రైల్వే పోలీసులు త‌మ‌ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

ఈ క్ర‌మంలో రైల్వే పోలీసులు తాము సేకరించిన ప్రాథమిక ఆధారాలు, అరెస్టయిన నిందితుల వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించారు. సుబ్బారావుతో పాటు సాయి అకాడమీ ప్రతినిధి శివ ఈ కుట్రలో భాగస్వామిగా ఉన్నార‌ని కోర్టుకు నివేదించారు. వీరిద్దరూ సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ లో విధ్వంసానికి ముందురోజు జూన్‌ 16 సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చారని వివ‌రించారు.

హకీంపేట సోల్జర్స్ వాట్సాప్ గ్రూప్‌లో ఆర్మీ అభ్యర్థులతో సుబ్బారావు, శివ‌ వేర్వేరుగా తీసుకున్న ఫొటోలున్నాయని నివేదించారు. సుబ్బారావును ఇప్ప‌టికే అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు విధ్వంసానికి ఆయ‌న‌ సహకరించాడని నిరూపించే సాక్ష్యాధారాలను సేకరించినట్టు స‌మాచారం. జూన్ 23న‌ అతడిని అరెస్టు చేసే అవకాశాలున్నాయ‌ని తెలుస్తోంది. అగ్నిపథ్‌ పథకం అమల్లోకి వస్తే త‌న డిఫెన్స్‌ అకాడమీకి రూ.50 కోట్ల మేర నష్టం వస్తుందనే భావనతో విధ్వంసానికి ప్ర‌ణాళిక ర‌చించార‌ని చెబుతున్నారు. ఇందుకు మ‌రికొన్ని అకాడ‌మీలు స‌హ‌కరించాయ‌ని అంటున్నారు. ఈ కోణంలోనూ రైల్వే పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట‌కు చెందిన ఆవుల సుబ్బారావుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డిఫెన్స్ అకాడ‌మీలు ఉన్నాయి. ఆర్మీ నిర్వ‌హించే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు అర్హులైన రెండు వేల మంది అభ్యర్థులు.. సాయి డిఫెన్స్ అకాడ‌మీతో సహా వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లోని వివిధ అకాడమీల్లో శిక్షణ పొందుతున్నారు. కరోనా వ‌ల్ల దాదాపు ఏడాదిన్న‌ర నుంచి ఆర్మీ పరీక్ష పలుమార్లు వాయిదా పడింది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో కేంద్ర ప్ర‌భుత్వం అగ్నిపథ్ తెచ్చింది. అంతేకాకుండా ఆర్మీ ప‌రీక్ష‌ను రద్దు చేయడంతో అభ్యర్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇదే సమయంలో ఆవుల సుబ్బారావు సహా పలు అకాడమీల యజమానులు.. అగ్నిపథ్‌ వల్ల తమ వ్యాపారానికి రూ.కోట్లలో నష్టం వస్తుందని లెక్కలు వేసుకున్నారు. కొన్నేళ్లుగా ఈ అకాడమీలు ఆర్మీలో చేరాలనుకున్న అభ్యర్థుల వద్ద నామమాత్రంగా రుసుం తీసుకుని శిక్షణ ఇస్తున్నాయి.

ఆ త‌ర్వాత అభ్య‌ర్థులు సైన్యంలోకి ఎంపికైతే.. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.2 లక్షల చొప్పున వసూలు చేస్తున్నాయి. ఈ మేర‌కు ఆర్మీకి ఎంపిక‌యిన త‌ర్వాత త‌మ‌కు డ‌బ్బులు చెల్లించేలా అభ్య‌ర్థుల‌తో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇలా ఆవుల సుబ్బారావుకు చెందిన అకాడ‌మీల్లో కొన్ని వేల మంది శిక్ష‌ణ పొందుతున్నారు. వారికి వ‌స‌తి, భోజ‌నం, శిక్ష‌ణ‌కు అయ్యే ఖ‌ర్చంతా ఆవుల సుబ్బారావే చూసుకుంటున్నారు. ఆ త‌ర్వాత అభ్య‌ర్థులు ఆర్మీకి ఎంపిక అయితే వారి నుంచి రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున తీసుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో రెండువేల మందికి శిక్షణ ఇస్తున్న అకాడమీలు అందులో సగం మందికి ఉద్యోగాలొచ్చినా, తమకు రూ.20 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేశాయి. అగ్నిపథ్‌ అమలైతే ఈ సొమ్ము నష్టపోతామని భావించిన ఆవుల సుబ్బారావు, శివ తదితరులు ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ లో విధ్వంసానికి పాల్పడేలా అన్నివిధాలా సహాయ సహకారాలు అందించారని రైల్వేపోలీసులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వారిద్ద‌రి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు.