Begin typing your search above and press return to search.

సుబ్బ‌రామిరెడ్డికి తెలంగాణవాదుల సెగ‌!

By:  Tupaki Desk   |   6 Feb 2018 5:51 PM GMT
సుబ్బ‌రామిరెడ్డికి తెలంగాణవాదుల సెగ‌!
X
హైద‌రాబాద్ లోని శిల్పకళా వేదికలో కొద్ది రోజుల క్రితం సినీ నటుడు మోహన్ బాబును మాజీ ఎంపీ, క‌ళా బంధు టి.సుబ్బరామి రెడ్డి సన్మానించి ‘విశ్వనట సార్వభౌమ’ బిరుదు ప్రదానం చేసిన విషయం తెలిసిందే. అయితే, `కాక‌తీయ క‌ళా వైభ‌వం` పేరుతో స్థానిక కళలు, కళాకారుల పురోగతికి తోడ్పడితే స్వాగతిస్తామని, సినీ న‌టుల‌కు స‌న్మానాలు చేస్తే స‌హించ‌బోమ‌ని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యుడు పాపారావు...హెచ్చరించారు. బుద్ధిస్ట్ హెరిటేజ్ కు సినిమా సంస్కృతిని జ‌త‌చేయ‌డం స‌రికాద‌ని, సినీ పరిశ్రమ వల్ల తెలంగాణ సంస్కృతికి భంగం క‌లిగింద‌ని, తీర‌ని నష్టం జరిగిందని,భ‌విష్య‌త్తులో ఇటువంటి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌వ‌ద్ద‌ని కోరారు. అయితే, సుబ్బ‌రామిరెడ్డి మాత్రం ముందుగా అనుకున్న‌ట్లుగానే 'కాకతీయ కళావైభవం' పేరుతో మార్చి 11న చారిత్రక వరంగల్ కోటలో.. సినీ ప్రముఖులకు సన్మానం చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా, రెండు రోజుల క్రితం వ‌రంగ‌ల్ లో ప‌ర్య‌టించిన సుబ్బరామిరెడ్డిపై కొంద‌రు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

ఆ కార్య‌క్ర‌మ నిర్వ‌హణ కోసం హన్మకొండలోని వేయి స్తంభాల గుడి, ఓరుగల్లు కోట, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం తదితర ప్రాంతాలను సుబ్బ‌రామిరెడ్డి పరిశీలించారు. వరంగల్ కోటలోని ఖుష్ మహాల్ ను ఫిక్స్ చేసి వేదిక నిర్మాణానికి పుర‌మాయించారు. అయితే, ఈ కార్య‌క్ర‌మంపై తెలంగాణ వాదులు, స్థానికులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ఆంధ్ర సినీ ప్రముఖులకు తెలంగాణలో సన్మానం చేయ‌డం వెనుక ఆంతర్యం ఏమిటని నిరసనకారులు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సుబ్బ‌రామిరెడ్డి కి స‌డెన్ గా ఇక్క‌డి ప్రజలపైన ప్రేమ ఎందుక‌ని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సినీ కళాకారులను పట్టించుకోకుండా, వారికి ఏ మాత్రం చేయూతనివ్వని ఆయ‌న ఇలా చేయ‌డం వెనుక ఏదో కుట్ర ఉందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రాంత సినీ కళాకారుల సన్మానానికి ఆంధ్రప్రదేశ్‌లో చోటు లేదా అని ప్ర‌శ్నిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణలోని కళాకారులు సినీ రంగంలో త‌మ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్న స‌మ‌యంలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించి వారి ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీస్తున్నార‌న్నారు. తెలంగాణ‌లో ఆంధ్ర సినీ పెద్దల పెత్తనం కొన‌సాగించేందుకే ఈ విధంగా చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. గ‌తంలో పాపారావు ఈ కార్య్ర‌మాన్ని బ‌హిష్క‌రించాల‌ని ప్ర‌క‌టన విడుద‌ల చేయ‌గా...తాజాగా ఖిలా వరంగల్‌ కార్పొరేటర్లు, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కూడా ఆ కార్యక్రమాన్ని ఖండించారు.