Begin typing your search above and press return to search.

యాదాద్రికి మెట్రో వర్క్ వుట్ అయ్యేనా?

By:  Tupaki Desk   |   27 Dec 2015 4:46 AM GMT
యాదాద్రికి మెట్రో వర్క్ వుట్ అయ్యేనా?
X
అసలు కంటే కొసరు ముద్దున్నట్లుగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సర్కారు తీరు. ఓపక్క మెట్రో రైలును అనుకున్న సమయానికి.. అనుకున్న విధంగా పట్టాలు ఎక్కించే విషయంలో లెక్కలు తప్పిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మెట్రోను మొదలుపెట్టకుంటే తిప్పలు తప్పవని ఈ ప్రాజెక్టును చేపట్టిన ఎల్ అండ్ టీ కిందా మీదా పడుతున్న పరిస్థితి. హైదరాబాద్ మహానగరంలో పరుగులు తీయాల్సిన మెట్రో.. అసలు విషయాన్ని వదిలేసి కొసరు విషయాల మీద ఫోకస్ పెరిగిందన్న మాట వినిపిస్తోంది.

మెట్రో నిర్మాణం కొన్ని చోట్ల అనుకున్నట్లే పూర్తి అయినా.. మరికొన్ని చోట్ల అసలు పనులే మొదలు కాని పరిస్థితి. వాస్తవానికి 2015 నాటికే ఒక రూట్ లో మెట్రో నడవాల్సి ఉంది. అయితే.. దాని వల్ల కలిగే ప్రయోజనం పెద్దగా ఉండదన్న ఉద్దేశంతో ఆగటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మెట్రోను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్న ఆలోచన తెలంగాణ అధికారపక్షానికి ఉన్నట్లుగా కనిపించటం లేదన్నది ఒక ఆరోపణ. మెట్రోను పూర్తి చేసే విషయం కంటే.. మెట్రోను విస్తరించే అంశంపై తరచూ ప్రకటనలు చేయటం ఈ మధ్యన ఎక్కువైంది.

ముందు.. అనుకున్న రీతిలో పట్టాలు ఎక్కించిన తర్వాత.. విస్తరణ అంశంపై దృష్టిపెడితే బాగుంటుంది. కానీ.. అందుకు భిన్నంగా పరిస్థితి నెలకొంది. మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి.. ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ మాట్లాడుతూ.. మెట్రో ప్రయాణం అద్భుతంగా ఉందని.. మెట్రో రెండో దశను 83 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సదరు ట్రయల్ రన్ జరిగిందని.. ఈ సందర్భంగా 83 కి.మీ. విస్తరణ మాట కేటీఆర్ నోట వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా మరో వార్త హడావుడి చేస్తోంది. తిరుమల స్థాయిలో తెలంగాణలో యాదగిరి గుట్టను అభివృద్ధి చేస్తామని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు తగ్గట్లే.. తాజాగా ఉప్పల్ నుంచి యాదాద్రికి మెట్రో రైలును పొడిగించాలన్న ఆలోచనపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇదెంతవరకు ఆచరణ సాధ్యమన్న దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఉప్పల్ నుంచి యాదాద్రికి మెట్రో రైల్ ను విస్తరించాలంటే 50కిమీ పనులు చేయాలి. కిలో మీటరు నిర్మాణానికి రూ.200కోట్ల చొప్పున.. ఈ విస్తరణకు రూ.10వేల కోట్ల కావాలి.

ఇంత భారీ మొత్తాన్ని వినియోగించినా.. దాని వల్ల ట్రాఫిక్ ఏమైనా భారీగా ఉంటుందా? అంటే అదీ ఉండదు. అలాంటి సమయంలో యాదాద్రికి మెట్రో అన్నది ఉత్త మాటల వ్యవహారమే తప్పించి మరొకటి కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. కొన్ని ఊహాలు అందంగా ఉంటాయని.. వాటి గురించి ఊహించుకోవటం కిక్కు ఇస్తుందని.. ఆ కోవకు చెందిందే.. యాదాద్రికి మెట్రో ఆలోచనగా చెబుతున్నారు.