Begin typing your search above and press return to search.

బాబు సభలకు విద్యార్ధుల తరలింపు...!?

By:  Tupaki Desk   |   13 Dec 2018 10:23 AM IST
బాబు సభలకు విద్యార్ధుల తరలింపు...!?
X
ఆంధ్రప్రదేశ్ లో విద్యార్ధులు బలి పశువులు అవుతున్నారు. కళాశాలలకు వెళ్లి చదువుకోవాల్సిన వారు అధికార పార్టీ నిర్వహించే సభలకు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సభలకు ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ఇటీవల చంద్రబాబు నాయుడు అనంతపురం - ప్రకాశం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సభలకు ఆయా జిల్లాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తీసుకురావాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు వెళ్లాయి. అయితే తెలుగుదేశం నాయకులు ఎంత మొత్తుకున్నా చంద్రబాబు నాయుడి సభలకు జనాలు మాత్రం రావడం లేదని అంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని తెలుగుదేశం నాయకులు ఇంజనీరింగ్ - డిగ్రీ కళాశాలలపై పడుతున్నారు. మంత్రుల చేత ఆయా కళాశాలల యాజమాన్యాలకు ఫోన్లు చేయించి మౌఖిక ఆదేశాలు జారీ చేయిస్తున్నారంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సభ ఎక్కడ జరిగితే ఆయా జిల్లాల్లో ఉండే కళాశాలలకు - పొరుగున ఉన్న కళాశాలలకు వర్తమానం పంపి విద్యార్ధులను బహిరంగ సభలకు ఆహ్వానిస్తున్నారంటున్నారు.

ఇప్పటికే రాష్ట్ర మంత్రులు కొందరు కొన్ని కళాశాలలకు మౌఖిక ఆదేశాలు ఇచ్చి విద్యార్ధులను తరలించే పనిని ప్రారంభించారు. అలా పంపించిన కళాశాలలకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి వారి లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరికలు కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు. విద్యార్ధులను కళాశాల బస్సులలో బహిరంగ సభలకు తీసుకురావడం - వారికి భోజనాలు ఏర్పాటు చేయడం వంటివి కూడా కళాశాల యాజమాన్యాలదే అని మంత్రులు ఆదేశించినట్లు చెబతున్నారు. దీనికి అనుగుణంగానే వివిధ జిల్లాల్లోని కళాశాలల యాజమాన్యాలు తమ విద్యార్ధులను చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభలు - సమావేశాలకు పంపుతున్నారని అంటున్నారు. విద్యార్ధుల్లో కొందరు బహిరంగ సభలకు వెళ్లమని తెగేసి చెబుతున్నారని సమాచారం. అయితే అలా వ్యతిరేకించిన విద్యార్ధులను పరీక్షల్లో తక్కువ మార్కులు వేస్తామని - మరీ మొండికేస్తే పరీక్షలను ఫెయిల్ చేస్తామని కూడా కళాశాలల యాజమాన్యాలు బెదిరిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాల్లో జరిగిన చంద్రబాబు నాయుడి బహిరంగ సభల్లో యువతీ యువకులు ఎక్కువ సంఖ్యలో ఉండడానికి కళాశాలల యాజమాన్యాల బలవంతపు సహకారమే కారణమని అంటున్నారు.