Begin typing your search above and press return to search.

విద్యార్థి ఆత్మహత్య...ద‌ద్ద‌రిల్లుతున్న ఓయూ

By:  Tupaki Desk   |   3 Dec 2017 2:28 PM GMT
విద్యార్థి ఆత్మహత్య...ద‌ద్ద‌రిల్లుతున్న ఓయూ
X
తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో విద్యార్థుల ఉద్య‌మాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ఉస్మానియా యూనివర్శిటీ మ‌రోమారు అదే విద్యార్థుల రూపంలో తెర‌మీద‌కు వ‌చ్చింది. ఓయూలో ఓ విద్యార్థి ఆత్మ‌హత్య‌ చేసుకున్నాడు. మెదక్ జిల్లాకు చెందిన మురళి క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. మానేరు వసతి గృహంలో ఉంటున్న మురళి తన రూమ్ నెంబర్ 159లో ఉరి వేసుకొని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. అయితే ఆయ‌న మ‌ర‌ణంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మురళి నిరుద్యోగం కారంణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఆయ‌న‌కు విద్యాప‌ర‌మైన స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతున్న‌ట్లు సూసైడ్ నోట్‌లో ఉంది.

మురళి ఓయూలో ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మురళి ఆత్మహత్యకు పాల్పడిన ప్రాంతం వద్ద పోలీసులకు సూసైడ్ నోట్ దొరికింది.. "అమ్మా నన్ను క్షమించు.. ఈ చదువులు భరించలేకపోతున్నా.. ఇంకా తట్టుకోవడం నావల్ల కాదు.. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. అన్నయ్య అమ్మను మంచిగా చూసుకో.. నేను ఆత్మహత్య చేసుకున్నానని అమ్మకు తెలియనివ్వకు" అని సూసైడ్ నోట్‌లో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.విద్యార్థి సూసైడ్ బాధాకరమని.. మురళి ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఓయూ వీసీ రామచంద్రరావు తెలిపారు.కాగా,విద్యార్థి మృతదేహం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

మ‌రోవైపు ఈ విష‌యం తెలుసుకున్న ప్రొ. కోదండ‌రామ్ హుట‌హుటిన ఉస్మానియాకు బ‌య‌ల్దేరారు. తోటి విద్యార్థి, మిత్రుడు బలవన్మరణాన్ని జీర్ణించుకోలేని వర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ సీఎంకు వ్యతిరేకంగా కేసీఆర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. వర్సిటీ విద్యార్థులతో పోలీసులు మాట్లాడుతున్నారు.