Begin typing your search above and press return to search.

ప్రేమ‌కు నో చెబితే.. ఓయూలో గొంతు కోశాడు

By:  Tupaki Desk   |   8 Aug 2018 5:14 AM GMT
ప్రేమ‌కు నో చెబితే.. ఓయూలో గొంతు కోశాడు
X
తెలిసీ తెలియ‌ని వ‌య‌సులో ఆక‌ర్ష‌ణను ప్రేమ‌గా అనుకోవ‌టం.. త‌ర్వాత వాస్త‌వం అర్థ‌మై.. వెన‌క్కి త‌గ్గ‌టం.. ఉన్మాదంతో ఊగిపోయే రాక్ష‌సుల బారిన విల‌విల‌లాడ‌టం.. ప్రాణాలు వ‌ద‌ల‌టం చూస్తున్న‌దే. తాజాగా అలాంటి దారుణ ఉదంతం ఒక‌టి హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో చోటు చేసుకుంది. ఒకే ట్యూష‌న్ వెళ్లే క్ర‌మంలో ప‌రిచ‌యం కాస్తా స్నేహంగా మారి.. ఆపై ప్రేమ‌గా రూపాంత‌రం చెందింది.

మ‌న‌స్ఫ‌ర్థ‌ల‌తో ఆర్నెల్లుగా దూరంగా ఉన్న వేళ‌.. మాట్లాడుకుందామ‌ని పిలిచి.. గొంతు కోసేసిన దారుణం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఓయూ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే.. అంబ‌ర్ న‌గ‌ర్ కు చెందిన ఉద్యోగి హ‌రిప్ర‌సాద్.. రేవ‌తి దంప‌తుల‌కు అనూష (16).. గ్రీష్మ‌లు ఇద్ద‌రు కుమార్తెలు.

ఈ మ‌ధ్య‌నే హ‌రిప్ర‌సాద్‌కు విజ‌య‌వాడ‌కు బ‌దిలీ అయ్యింది. దీంతో.. కుటుంబాన్ని హైద‌రాబాద్‌లో ఉంచి విజ‌య‌వాడ వెళ్లి వ‌స్తున్నారు. అనూష నారాయ‌ణ‌గూడ‌లోని నారాయ‌ణ జూనియ‌ర్ కాలేజీలో ఇంట‌ర్ చ‌దువుతోంది. అదే ప్రాంతంలో ఉండే ర‌వీంద‌ర్ కుమారుడు వెంక‌టేశ్ (19) హిమాయ‌త్ న‌గ‌ర్ లోని న్యూ చైత‌న్య జూనియ‌ర్ కాలేజీలో చ‌దువుతున్నాడు.

ప‌క్క‌ప‌క్క వీధుల్లో ఉండే వీరి మ‌ధ్య ప‌రిచ‌యం కాస్తా.. ప్రేమ‌గా మారింది. రెండేళ్ల వీరి ప‌రిచ‌యంలో వెంక‌టేశ్ తీరుతో విసుగు చెందిన అనూష గ‌డిచిన ఆర్నెల్లుగా దూరంగా ఉంటోంది. త‌న‌ను వ‌దిలేయాల‌ని కోర‌ట‌మే కాదు.. అత‌డి ప్రేమ‌కు నో చెప్పింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న వెంక‌టేశ్ ఆమెను ఎలాగైనా చంపేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. మాట్లాడ‌టానికి రావాల‌ని చెప్పి.. ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్ సెంటర్ స‌మీపంలోని క్వార్ట‌ర్స్ వ‌ద్ద‌కు పిలిచాడు.

అత‌డ్ని న‌మ్మి వ‌చ్చిన ఆమెను అంతం చేశాడు. ఇరువురి మ‌ధ్య మాట‌లు కాస్తా.. వాగ్వాదంగా మార‌టం.. త‌న‌తో తెచ్చుకున్న బ్లేడ్ తో అనూష్ గొంతు కోసేశాడు. దీంతో షాక్ తిన్న ఆమె.. భ‌యంతో గ‌ట్టిగా కేక‌లు వేసింది. అంత‌లోనే కుప్ప‌కూలిపోయింది. అనూష అరుపులు విన్న ఇమ్రాన్.. ఇజాజ్ అనే ఇద్ద‌రు యువ‌కులు ఘ‌ట‌నాస్థ‌లానికి వెళ్లారు. వారిని చూసిన వెంక‌టేశ్‌.. అక్క‌డి నుంచి పారిపోయే ప్ర‌య‌త్నం చేశాడు. అత‌డ్ని ప‌ట్టుకున్న వారికి స్థానికులు తోడ‌య్యారు.విష‌యం అర్థ‌మై అత‌డ్ని చిత‌క‌బాదారు.

పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకొని..అనూష‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించే క్ర‌మంలో ఆమె మ‌ర‌ణించింద‌ని గుర్తించారు. ప్రేమోన్మాదంలోనే ఈ దారుణానికి పాల్ప‌డి ఉంటార‌ని భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న వ‌ర్సిటీ ప్రాంతంలో సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. ఉద్రిక్తత చోటు చేసుకుంది.