Begin typing your search above and press return to search.

ఎన్నారైల్లో వ‌ణుకు పుట్టిస్తున్న హెచ్‌1బీ

By:  Tupaki Desk   |   17 May 2017 3:34 PM IST
ఎన్నారైల్లో వ‌ణుకు పుట్టిస్తున్న హెచ్‌1బీ
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యాన దేశంలోని మెజార్టీ ఉద్యోగులు త‌మ కొలువుల విషయంలో క‌ల‌వ‌రంతో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే స్థానిక ఉద్యోగుల‌కు ఇలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతుండ‌గా...అమెరికాలో హెచ్‌1బీ వీసాల ఆధారంగా ఉద్యోగాలు చేస్తున్న మ‌న ఎన్నారైల‌కు కొత్త భ‌యాలు మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు హెచ్‌1బీ వీసాల జారీ విష‌యంలో అనూహ్య నిబంధ‌న‌లు తెర‌మీద‌కు రాగా...ఇప్పుడు రెన్యువ‌ల్ వీసాల విష‌యంలో మ‌న ఎన్నారైల‌కు భ‌యం ప‌ట్టుకుంది. వీసా రెన్యువ‌ల్ విష‌యంలో క‌ఠిన‌మైన వెరిఫికేష‌న్లు జ‌రుగుతుండ‌టంతో హెచ్‌1బీ ఉద్యోగుల్లో త‌మ‌కు అమెరికాలో ఉండే చాన్స్ ఉంటుందా లేదా అన్న ఆందోళ‌న పెరిగిపోతోంది.

గ‌తంలో వీసా గ‌డువు ముగిసిన‌/ముగుస్తున్న వారు రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే త్వ‌ర‌గానే క్లియ‌ర్ అయ్యేవని ప్ర‌వాస తెలుగువారు గుర్తుచేస్తున్నారు. అయితే ఇటీవ‌లి కాలంలో యూఎస్‌సీఐఎస్‌ కార్యాలయం నుంచి స‌ద‌రు ఉద్యోగికి హెచ్1బీ నియ‌మ‌నిబంధ‌న‌ల‌కు సంబంధించి ప‌త్రాలు చూపించాల‌నే ఆదేశాలు (ఆర్‌ఎఫ్‌ఏ) వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదివరకు వీసా రెన్యువల్‌కు చేసిన దరఖాస్తుల్లో తక్కువ వాటికే ఆర్‌ఎఫ్‌ఏ వచ్చేదని కానీ ఇపుడు దాదాపు అన్ని దరఖాస్తులకూ ఆర్‌ఎఫ్‌ఏ వస్తున్నట్లు చెబుతున్నారు. దీన్నిబట్టి వీసా నిబంధనలను మరింత కఠినం చెస్తున్నట్లు అర్థమవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పలువురు తెలుగువారు తిరిగి స్వదేశానికి వెళ్లక తప్పదని కొంద‌రు విశ్లేషిస్తున్నారు.

అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అనే ట్రంప్‌ పాలసీలకు అనుగుణంగా మరింత మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించటానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ అక్కడే మూడు కేంద్రాలు ఆరంభిస్తామని, స్థానికులను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పటమే కాక దానికి తగ్గట్టు అక్కడ రిక్రూట్‌మెంట్లు కూడా మొదలుపెట్టింది. కాగ్నిజెంట్, టీసీఎస్, విప్రో తదితర ఐటీ దిగ్గజాలు కూడా అదే పనిలో పడ్డాయి. ఇలా స్థానికులకే ఉద్యోగాల‌నే ప్ర‌క్రియ‌లో కొన్ని నిబంధనల్ని కూడా సడలించుకుంటున్నారని ప‌లువురు పేర్కొంటున్నారు. ఐటీ రంగంలో ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలకు ఇప్పటిదాకా ఉన్న‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఉత్తీర్ణ‌త తప్పనిసరి అనే నిబంధ‌న‌ను కూడా సడ‌లించి కోడ్ రాయ‌గ‌లిగే వారిని తీసుకునేందుకు సైతం స్థానిక కంపెనీలు ఆస‌క్తి చూపిస్తున్నాయ‌ని తెలుస్తోంది. అంతేకాకుండా వారికి స‌ద‌రు ఉద్యోగుల‌కు ఉన్న‌త విద్యాభ్యాసం కోసం స‌హాయం చేసేందుకు సైతం ముందుకు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం.

కాగా మ‌న ఎన్నారైల‌కు ఇలాంటి ప‌రిస్థితి త‌లెత్త‌డంపై భిన్న‌మైన విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. భారతీయులు కేవ‌లం సేవ‌ల విభాగాన్ని న‌మ్ముకోవ‌డం వ‌ల్లే స‌మ‌స్య‌లు వ‌చ్చిప‌డుతున్నాయ‌ని అంటున్నారు. ఆటోమేష‌న్ పెర‌గ‌డం, ఐటీ రంగంపై ఖ‌ర్చులు త‌గ్గించుకోవ‌డం కూడా ఐటీ రంగం జోరు త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌ని అంటున్నారు. అందుకే ఐఓటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అంశాల్లో కొత్త నైపుణ్యాలు పెంపొందించుకొని ఆవిష్క‌ర‌ణ‌ల వైపు సాగాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.