Begin typing your search above and press return to search.

ఆసుప‌త్రిలో శ్రీ‌నుతో మాట్లాడుతున్న అప‌రిచితులు ఎవ‌రు?

By:  Tupaki Desk   |   25 April 2019 9:07 AM GMT
ఆసుప‌త్రిలో శ్రీ‌నుతో మాట్లాడుతున్న అప‌రిచితులు ఎవ‌రు?
X
విశాఖ ఎయిర్ పోర్ట్ లో విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై హ‌త్యాయ‌త్నం చేసిన జనుప‌ల్లి శ్రీ‌నివాస‌రావును ఆసుప‌త్రికి త‌ర‌లించిన ఎపిసోడ్ పై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాజ‌మహేంద్ర‌వ‌రం సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ముద్దాయిగా శిక్ష అనుభ‌విస్తున్న అత‌డ్ని వైర‌ల్ ఫీవ‌ర్ పేరుతో ఆసుప‌త్రికి త‌ర‌లించ‌టం ఒక ఎత్తు కాగా.. ఆసుప‌త్రిలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల నేప‌థ్యంలో కొత్త అనుమానాలు త‌లెత్తుతున్నాయి.

జైలు నుంచి గుట్టుగా ఆసుప‌త్రికి త‌ర‌లించిన శ్రీ‌నును.. గ‌డిచిన రెండు రోజులుగా అప‌రిచితులు ప‌లువురు వ‌చ్చి మాట్లాడుతున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ నెల 22న భారీ బందోబ‌స్తు మ‌ధ్య శ్రీ‌నివాస‌రావును సెంట్ర‌ల్ జైలు నుంచి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప‌లు ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన వైద్యులు మ‌లేరియాతో బాధ ప‌డుతున్న‌ట్లు గుర్తించారు.

ఇదిలా ఉంటే.. చికిత్స చేస్తున్న శ్రీ‌నివాస‌రావు వ‌ద్ద‌కు ప‌లువురు అప‌రిచితులు మాట్లాడి వెళుతున్న వైనం ఇప్పుడు ప‌లు ప్ర‌శ్న‌ల‌కు తావిస్తోంది. ఈ అనుమానానికి కారణం లేక‌పోలేదు. ఆసుప‌త్రిలోని ప‌లు విభాగాల‌కు సీసీ కెమెరాలు ఉన్న‌ప్ప‌టికి.. శ్రీ‌నివాస్ ఉన్న ఐసీయూ వ‌ద్ద మాత్రం కెమెరాలు లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం.

ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డి అనంత‌రం రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే అవ‌కాశం ఉండ‌టంతో శ్రీ‌నివాస‌రావును ప‌లువురు భేటీ అవుతున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే అత‌డ్ని ఆసుప‌త్రిలో చేర్చిన‌ట్లుగా తెలుస్తోంది. జైలులో భేటీ అయిన ప‌క్షంలో.. భేటీ అయిన వారి ఆధార్ కార్డుతోపాటు.. గుర్తింపు కార్డుల వివ‌రాలు కూడా అక్క‌డి లాగ్ బుక్ లో న‌మోదు చేయాల్సి ఉంటుంది. ఈ కార‌ణంతోనే అనారోగ్యం పేరుతో ఆసుప‌త్రికి త‌ర‌లించారా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆసుప‌త్రిలో గుట్టుగా క‌లుస్తున్న అప‌రిచితులు ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.