Begin typing your search above and press return to search.

33 హత్యల క్రైం మిస్టరీ కథ

By:  Tupaki Desk   |   13 Sep 2018 10:07 AM GMT
33 హత్యల క్రైం మిస్టరీ కథ
X
దేశవ్యాప్తంగా వరుస హత్యలు.. అంతా లారీ డ్రైవర్లు - క్లీనర్లే.. చంపేసి వారిని నగ్నంగా కొండలు - లోయల్లో పడేస్తున్నారు. ఒక్క క్లూ కూడా లేకుండా ఈ హత్యల పరంపర సాగుతోంది. మహారాష్ట్ర - మధ్యప్రదేశ్ - ఉత్తరప్రదేశ్ - బీహార్ - ఒడిశా - చత్తీస్ ఘడ్ - జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఈ హత్యలు సాగాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో రెండు వరుస హత్యలు కలకలం రేపాయి. దీని వెనుక ఎవరున్నారు? లారీ డ్రైవర్ - క్లీనర్లనే ఎందుకు చంపుతున్నారు.? వారినే ఎందుకు దోచుకుంటున్నారనేది పోలీసులకు సవాల్ గా మారింది.

మధ్యప్రదేశ్ లోని మండీదీప్ పట్టణానికి చెందిన ఆదేశ్ ఖమ్రా (48) టైలర్ గా పనిచేస్తూ జీవిస్తుంటాడు. పగలు టైలర్ గా.. రాత్రయితే చాలు నరరూప రాక్షసుడిగా మారిపోతాడు. రోడ్డున పోయే లారీలను లిఫ్ట్ అడగడం.. డ్రైవర్ - క్లీనర్ లకు మత్తు మందు కలిపిన మద్యం ఇచ్చి సృహ కోల్పోయేలా చేసి వారిని కిరాతకంగా చంపేయడం అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత లారీలో ఉన్న నగదు - వస్తువులను దోచుకెళ్లడాన్ని పనిగా పెట్టుకున్నారు. ఈ వరుస హత్యలపై సీరియస్ గా దృష్టిపెట్టిన పోలీసులు యూపీలోని అటవీ ప్రాంతాన్ని మూడు రోజులు జల్లెడ పట్టి చివరకు ఆదేశ్ ను పట్టుకున్నారు. అతడి క్రైం స్టోరీ విని విస్తుపోయారు.

లారీలను లిఫ్ట్ అడిగి వారికి మద్యం తాగించి ఆదేశ్ చంపేవాడని పోలీసులు తేల్చారు. ఇతడికి ప్రజాపతి - తుకారంలు అనుచరులుగా ఉండేవారిని తేల్చారు. ఇలా ఎందుకు చంపుతున్నావని అనుచరులు అడిగితే.. ‘వీరంతా కష్టాల్లో ఉన్నారని.. వారికి విముక్తి కల్పించడానికే చంపుతున్నానని ’ తన అనుచరులకు ఆదేశ్ తెలిపేవాడని పేర్కొన్నారు. అనంతరం మృతులను గుర్తించకుండా నగ్నంగా వారిని ఎత్తైన కొండలు - బ్రిడ్జీల సమీపంలో పడేసేవాడట..

పోలీసులు నిందితుడు ఆదేశ్ ను పట్టుకున్నా అతడినుంచి నిజాలు బయటపెట్టించడం కష్టమైంది. కరుడుగట్టిన ఈ సైకో నుంచి నిజాలు బయటపెట్టించేందుకు పోలీసులు దెయ్యం కథ అల్లారు. మీ కొడుకు వరుస రోడ్ యాక్సిడెంట్లకు చనిపోయిన లారీ డ్రైవర్ల ఆత్మలే కారణమని.. వారు నిన్ను - నీ కుటుంబాలను చంపేస్తారని.. నిజం చెప్పాలని పోలీసులు బెదిరించడంతో మొత్తం తాను 33 హత్యలు చేసినట్టు ఆదేశ్ ఒప్పుకోవడం విశేషం.