Begin typing your search above and press return to search.

ఆ సీఎం బ‌స్సు యాత్ర‌పై రాళ్ల‌దాడి!

By:  Tupaki Desk   |   27 Aug 2018 4:36 AM GMT
ఆ సీఎం బ‌స్సు యాత్ర‌పై రాళ్ల‌దాడి!
X
బీజేపీకి అప‌శ‌కునాలు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నాయి. క‌మ‌ల‌నాథుల ఏలుబ‌డిలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ వ్య‌తిరేక ప‌వ‌నాలు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నాయి. దీనికి నిద‌ర్శ‌నంగా ఈ ఏడాది చివ‌ర్లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలి త‌గిలే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాలు బ‌లంగా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బీజేపీ స‌ర్కారు ఉన్న మ‌ధ్య‌ప్ర‌దేశ్.. రాజ‌స్తాన్.. చ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రాల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఎక్కువ‌గా ఉంద‌ని.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌మ‌ల‌నాథుల‌కు ఓట‌మి షాక్ త‌ప్ప‌ద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

దీనికి త‌గ్గ‌ట్లే.. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామం బీజేపీ వ‌ర్గాల్లో ఆందోళ‌న‌ల్ని పెంచుతోంది. రాజ‌స్తాన్ ముఖ్య‌మంత్రి వ‌సుంధ‌రా రాజె.. రాజ‌స్తాన్ గౌర‌వ యాత్ర‌ను చేప‌ట్టారు. రాష్ట్రంలోని కీల‌క ప్రాంతాల్లో ఆమె బ‌స్సుయాత్ర చేప‌ట్టారు. దీనికి ప్ర‌జ‌ల నుంచి సానుకూల స్పంద‌న కంటే.. వ్య‌తిరేక గాలి వీస్తోంది. ఈ వాద‌న‌కు బ‌లం చేకూరేలా తాజా ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

తాజాగా రాజ‌స్తాన్ సీఎం ప్ర‌యాణం చేస్తున్న బ‌స్సుపై కొంద‌రు నిర‌స‌నకారులు రాళ్ల‌దాడికి పాల్ప‌డ్డారు. జోధ్ పూర్ లో ఆమె చేస్తున్న బ‌స్సు యాత్ర‌పై రాళ్ల‌దాడి జ‌రిగింది. దీంతో.. త‌న యాత్ర‌ను తాత్కాలికంగా ర‌ద్దు చేసుకున్న వ‌సుంధ‌రాజె విమానంలో జైపూర్ కు వెళ్లిపోయారు. రాళ్ల దాడి వెనుక కాంగ్రెస్ నేత‌లు ఉన్నారంటూ బీజేపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అధికార‌ప‌క్షం చేస్తున్న యాత్ర మీద రాళ్ల‌దాడి చేసేంత బ‌లం కాంగ్రెస్ లో ఉందా? అన్న అనుమానాల్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.