Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి అతిపెద్ద స‌వాల్ పై క్లారిటీ

By:  Tupaki Desk   |   1 Nov 2015 8:25 AM GMT
అమ‌రావ‌తి అతిపెద్ద స‌వాల్ పై క్లారిటీ
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమరావతికి ఎదుర‌యిన అతి పెద్ద ప‌రీక్షపై తాజాగా స్ప‌ష్ట‌త రానుంది. అమ‌రావ‌తి నిర్మాణానికి సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి ఇంకా అనేక అనుమతులు రావల్సి ఉంది. అటవీ అనుమతిని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ప‌లువురు మంత్రులు ప్రకటించినా, జలకాలుష్యం - వృక్షాల నరికివేత - కొత్తగా హరితవనాల పెంపకం - అటవీ చట్టం నుంచి మినహాయింపు వంటి అంశాలపై ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు రావల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అటవీ చట్టం నుండి అటవీ భూములను మినహాయిస్తూ నిర్ణ‌యం తీసుకున్నా అనేక అంశాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ కావాల్సి ఉంది.

అమ‌రావ‌తి కోసం 19,256 హెక్టార్ల రిజర్వు ఫారెస్టు భూమిని అటవీ పరిధి నుంచి మినహాయించాల్సి ఉంటుంది. అయితే అందుకు రెండు రెట్లు అంటే సుమారు 40వేల హెక్టార్లలో అడవులను పెంచుతామని ప్రభుత్వం కేంద్రానికి హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై పర్యావరణవేత్తలు ఇప్పటికే అనుమానాలను లేవనెత్తుతున్నారు. మరోవైపు అమరావతి డెవలప్‌ మెంట్ ప్లాన్‌ ను అనుసరించి పర్యావరణ అనుమతికి స్టేట్ ఎన్విరాన్‌ మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌ మెంట్ అథారిటీ (ఎస్‌ ఇఐఎఎఏ) అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఇటీవల జరిగిన అథారిటీ సమావేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వ చర్యలను నిలదీసింది. ఈ ప్ర‌శ్న‌ల‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణలతో కూడిన నివేదికను అథారిటీ నవంబర్ 1న ఇవ్వనుంది. రాష్ట్ర అర్బన్ గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌ కు ఈ నివేదికను అందజేయనుంది. ఈ అథారిటీ ఇచ్చే నివేదిక రానున్న రోజుల్లో పర్యావరణ అనుమతులకు సంబంధించి చాలా కీలకం కానుంది.