Begin typing your search above and press return to search.

స్టాలిన్ వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్‌... ఇంకో ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   5 Feb 2022 1:30 PM GMT
స్టాలిన్ వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్‌... ఇంకో ట్విస్ట్‌
X
గ‌త కొద్దిరోజులుగా వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు వ‌ర్సెష్ గ‌వ‌ర్న్ అన్న‌ట్లుగా స‌మీక‌ర‌ణాలు మారుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీకి ఆ రాష్ట్ర సీఎంకు హ‌ద్య అయితే ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌న్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇదే జాబితాలో మ‌రో కీల‌క ముఖ్య‌మంత్రి వ‌ర్సెస్ రాష్ట్ర గ‌వ‌ర్నర్ మ‌ధ్య విబేధాలు పొడ‌చూపాయి. వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ నుంచి తమిళనాడును మినహాయించాలని పేర్కొంటూ తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన బిల్లు కార‌ణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం గవర్నర్‌ మధ్య వివాదం తీవ్రమవుతోంది. ఈ బిల్లును గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తిప్పిపంపారు.

వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష ‘నీట్‌’ను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గత ఏడాది నీట్‌ పరీక్ష రాసిన పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో గ్రామీణ, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నీట్‌ వల్ల చాలా నష్టం జరుగుతున్నదని డీఎంకే ప్రభుత్వం పదే పదే చెబుతున్నది. ప్రైవేట్‌గా కోచింగ్‌ తీసుకునే స్థోమత ఉన్న విద్యార్థులు మాత్రమే నీట్‌ పాసవుతున్నారని పేర్కొంది. నీట్‌కు వ్యతిరేకంగా తమిళనాడు గతేడాది సెప్టెంబర్‌లో బిల్లును రూపొందించి అనంత‌రం అసెంబ్లీ ఆమోదం తెలిపి గవర్నర్‌కు పంపింది.

నిబంధ‌న‌ల ప్ర‌కారం రాష్ట్ర ప్ర‌భుత్వం పంపించిన ఈ బిల్లును గవర్నర్‌ రాష్ట్రపతికి పంపాలి.. లేకపోతే పునఃసమీక్ష కోసం తిరిగి అసెంబ్లీకి పంపాలి. కానీ గవర్నర్‌ అదేమీ చేయలేదు. బిల్లును తన వద్దే పెట్టుకొన్నారు. దీనిపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. విమర్శలు రావడంతో శుక్రవారం గవర్నర్‌ ఈ బిల్లును తిరిగి అసెంబ్లీకి పంపారు. దీనిపై పార్లమెంట్‌లో చర్చకు డీఎంకే, కాంగ్రెస్‌ ఎంపీలు పట్టుబట్టారు.

ఇదిలాఉండ‌గా, ఇటీవల రిపబ్లిక్‌ డే ప్రసంగం సందర్భంగా ఈ బిల్లుపై గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్‌ అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందని అన్నారు. ‘నీట్ ప్రవేశానికి ముందు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్లు పొందే విద్యార్థులు ఒక శాతమైనా ఉండేవారు కాదు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్ కల్పించిన చర్యకు ధన్యవాదాలు. దీని వల్ల ఆ సంఖ్య గణనీయంగా మెరుగుపడింది’ అని గవర్నర్ తెలిపారు. కాగా, కేంద్ర నిర్ణ‌యాల ప్ర‌కార‌మే గ‌వ‌ర్న‌ర్ ముందుకు సాగుతున్నార‌ని డీఎంకే ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను కాపాడ‌టం లేద‌ని మండిప‌డుతోంది.