Begin typing your search above and press return to search.

విషాదంలో ముంచేస్తూ..మనోడు నిర్జీవిగా వచ్చాడు

By:  Tupaki Desk   |   28 Feb 2017 4:55 AM GMT
విషాదంలో ముంచేస్తూ..మనోడు నిర్జీవిగా వచ్చాడు
X
అమెరికాలోని విద్వేష తూటాకు బలైన కూఛిబొట్ట శ్రీనివాస్.. నిర్జీవిగా హైదరాబాద్ కు చేరుకున్నారు. కాల్పుల అనంతరం.. ఆయన్ను స్వదేశానికి తీసుకొచ్చేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు జరిగాయి. చివరకూ ఆయన్ను అమెరికా నుంచి భారత్ కు తీసుకొచ్చారు. సోమవారం రాత్రి పది దాటిన తర్వాత హైదరాబాద్ కు చేరుకున్న ఆయన భౌతికకాయాన్ని రాత్రి 11.30 గంటల వేళలో హైదరాబాద్ శివారులోని మల్లంపేటలోని ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు.

కొడుకు భౌతికకాయాన్ని చూడటంతో శ్రీనివాస్ తల్లిదండ్రులు.. బంధుమిత్రులు.. అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. కొడుకుమృతదేహాన్ని చూసిన శ్రీనివాస్ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ దృశ్యం చూపురుల కంట తడిపెట్టించింది. అక్కడి వాతావరణం తీవ్ర భావోద్వేగంతో నిండిపోయింది. శ్రీనివాస్ భౌతికకాయం రాత్రి 9.30 గంటలకే ఇంటికి చేరుతుందన్న సమాచారంతో ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున జనసందోహం ఆయన ఇంటికి చేరుకుంది.

శ్రీనివాస్ మృతదేహంతో పాటు.. అమెరికా నుంచి ఆయన భార్య సునయన.. శ్రీనివాస్ సోదరుడు.. అతడి సతీమణి.. స్నేహితుడు వచ్చారు. భౌతికకాయాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు ఎంపీ మల్లారెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్ తోపాటు.. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజులు శ్రీనివాస్ కుటుంబ సభ్యుల వెంటే ఉన్నారు. శ్రీనివాస్ భౌతికకాయం ఎయిర్ పోర్ట్ కు చేరుకునే సమయానికి ఏపీ మంత్రులు మహేందర్ రెడ్డి.. పల్లెరఘునాథ్ రెడ్డిలు ఉండి.. శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ రోజు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో శ్రీనివాస్ అంత్యక్రియలు జరగనున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/