Begin typing your search above and press return to search.

ప్రేమ మైకంలో ప్రియుడి కోసం ప్రియురాలి దోపిడీ

By:  Tupaki Desk   |   29 May 2022 2:30 PM GMT
ప్రేమ మైకంలో ప్రియుడి కోసం ప్రియురాలి దోపిడీ
X
రెండురోజుల కిందట జరిగిన శ్రీకాళహస్తి బ్యాంకు చోరీ ఘటనలో షాకింగ్ విషయం బయటపడింది. బ్యాంకుకే కన్నం వేసిన వారి విషయంలో సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. గంటల వ్యవధిలో దర్యాప్తు జరిపి నిగ్గుతేల్చారు. ప్రేమ మైకంలో ఓ ప్రియురాలు.. ప్రియుడి కోసం ఈ బ్యాంకు దోపిడీకి పాల్పడిందని తేలింది.

శ్రీకాళహస్తిలోని ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో చీకటి పడిన తర్వాత దొంగలు చొరబడ్డారు. అప్పటికీ అందరూ వెళ్లిపోవడంతో పని సులువైంది. స్రవంతి అనే మహిళా ఉద్యోగి మాత్రమే విధుల్లో ఉంది. ఆమెను నిర్బంధించిన దొంగలు బ్యాంకులో ఉన్న బంగారం, డబ్బును ఎత్తుకెళ్లారు. తేరుకున్న స్రవంతి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వాళ్లకు ఒకటే అనుమానం కలిగింది.

అసలు అంత రాత్రి వరకూ స్రవంతి ఆఫీసులో ఏం చేస్తోందని పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెతోపాటు ఉన్న మరో ఉద్యోగి బయటకు వెళ్లిన తర్వాత దొంగతనం ఎలా జరిగిందని పోలీసులు ఆరాతీశారు. ఓ ఇద్దరు మహిళా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. స్రవంతిని తమదైన శైలిలో ప్రశ్నించారు.

దీంతో స్రవంతి అసలు విషయం బయటపెట్టింది. తన ప్రియుడి కోరిక మేరకు బ్యాంకులో నగలు, డబ్బు దొంగిలించినట్టు స్రవంతి అంగీకరించింది. అప్పటివరకు గుక్కపెట్టి ఏడ్చిన స్రవంతిని చూసి జాలిపడిన పోలీసులు, అధికారులు ఆమె చెప్పిన నిజం విని అవాక్కయ్యారు. తన ప్రియుడు కోసం.. ప్రియుడి కోరిక మేరకు ఈ బ్యాంక్ దోపిడీ చేశానని స్రవంతి చెప్పుకొచ్చింది.

బ్యాంకులో ఉన్న 2.25 కిలోల బంగారాన్ని, 5 లక్షల నగదును పక్కా ప్లాన్ తో ముగ్గురు వ్యక్తుల సహాయంతో బ్యాంకు నుంచి స్రవంతి తరలించింది. ఆ తర్వాత తన వాటాగా వచ్చిన కిలో బంగారాన్ని భద్రంగా దాచుకుంది.

ఈ బంగారంతోపాటు చెన్నైకి పారిపోయిన ఆ ముగ్గురు దొంగల నుంచి కూడా మిగతా బంగారాన్ని, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.