Begin typing your search above and press return to search.

సైకిల్ ఎక్కలేదని కమిటీకి చెప్పిన ఎస్ పీవైరెడ్డి

By:  Tupaki Desk   |   11 Sep 2015 9:44 AM GMT
సైకిల్ ఎక్కలేదని కమిటీకి చెప్పిన ఎస్ పీవైరెడ్డి
X
అధికార పార్టీ లోకి మారేందుకు విపక్ష నేతలు కొందరు ప్రయత్నిస్తుంటారు. అధికారానికి దూరంగా ఉండటానికి ఏ మాత్రం ఇష్టపడని ఇలాంటి నేతల వైఖరితో.. ఆయా పార్టీలు తీవ్ర ఇబ్బందికి గురి అవుతుంటాయి. అయితే.. ఇలాంటి నేతలకు పదవీ గండం ఎదురైతే మాత్రం పిల్లి మొగ్గలేసేసి.. అబ్బేబ్బే పార్టీ మారలేదన్న బుకాయింపు చోటు చేసుకుంటుంది.

కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్ పీవై రెడ్డి ఉదంతం అచ్చు ఇదే రీతిలో ఉంటుంది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల లోక్ సభ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఎస్ పీవైరెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. అటు రాష్ట్రంలోనూ.. ఇటు కేంద్రంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ కు పవర్ లేకపోవటంతో పునరాలోచనలో పడిన ఆయన.. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.

తాను పార్టీ మారినట్లుగా ఎస్ పీవైరెడ్డి చెప్పటం.. మీడియాలో ప్రముఖంగా రావటం జరిగిపోయాయి. పార్టీ మారేసిన ఎస్ పీవైరెడ్డి.. తాను ఎంపీగా గెలిచిన పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. దీంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఎస్ పీవైరెడ్డిని అనర్హుడ్ని చేస్తూ నిర్ణయం తీసుకోవాలంటూ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతానికి సంబంధించిన విచారణ తాజాగా జరిగింది.

దీనికి హాజరైన ఎస్ పీవై రెడ్డి తాను తెలుగుదేశం పార్టీలో చేరలేదని వాదించారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి మాత్రం ఎస్ పీవైరెడ్డి పార్టీ మారినట్లుగా వాదించారు. ఇరుపక్షాల వాదనను విన్న అహ్లువాలియా కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. దీనిపైనే ఎస్ పీవైరెడ్డి ఎంపీ పదవి భవితవ్యం ఆధారపడి ఉంది. కమిటీ నిర్ణయం ఎస్ పీవైరెడ్డికే కాదు.. ఏపీ అధికారపక్షాన్ని కూడా ప్రభావితం చేయనుంది.